జమ్మూకశ్మీర్లో పుల్వామా తరహా భారీ ఉగ్రకుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. సుమారు 20 కిలోల పేలుడు పదార్ధాలతో వెళ్తున్న ఓ కారును భద్రతా దళాలు స్వాధీనం చేసుకొని, ప్రేలుడు పదార్ధాలను కాల్చివేశాయి.
పుల్వామాలోని అవిగుండ్ రాజ్పొరా ప్రాంతంలో నకిలీ రిజిస్ట్రేషన్ నెంబర్తో వెళ్తున్న వాహనాన్ని ఇవాళ ఉదయం చెక్ పాయింట్ వద్ద భద్రతా దళాలు అడ్డుకోగా, వాహనాన్ని ఆపకుండా బారికేడ్లను ఢీకొట్టి ముందుకు వెళ్లడంతో కాల్పులు జరిపారు. దానితో శాంట్రో కారును వదిలేసి డ్రైవర్ తప్పించుకుని వెళ్లాడు. ఐఈడీలతో ఉన్న వాహనాన్ని అక్కడ వదిలేసి వెళ్ళాడు.
ఉగ్రదాడికి కుట్ర పణ్ణిన్నట్లు తమకు నిఘా వర్గాలు సమాచారం అందించడంతో నిన్నటి నుండి ఐఈడీలతో ఉన్న వాహనం కోసం తనిఖీ నిర్వహిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ తెలిపారు. ఇఈడీలతో ఉన్న కారును తర్వాత బాంబు స్క్వాడ్ పేల్చేసింది.
గత ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలోనే సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిని ఐఈడీలతో నిండిన వాహనం ఢీకొట్టిన ఘటనలో 40 మంది జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. . పరారైన ఉగ్రవాదిని హిజ్బుల్ కార్యకర్తగా భావిస్తున్నారు. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు.
గత రెండు నెలల నుంచి జమ్మూకశ్మీర్లో ఉగ్ర దాడులు ఊపందుకున్నాయి. సుమారు 30 మంది భద్రతా సిబ్బంది ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో సుమారు 38 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ఇటీవలే హిజ్బుల్ ముజాయిద్దిన్ కమాండర్ రియాజ్ నైకూను భద్రతా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే.