నిత్యావసర వస్తువులను అధిక ధరలను విక్రయిస్తే జైలుకు వెళ్ళవలసి వస్తుందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. కరోనా కట్టడి చర్యలపై అత్యున్నత స్థాయి సమక్ష జరుపుతూ ఆ విధంగా అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలని, దీనిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు.
నిత్యావసరాలు అమ్మే దుకాణం వద్ద ధరల పట్టికను కచ్చితంగా ప్రదర్శించాలని, అదే పట్టికలో అధిక ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయాల్సిన కాల్ సెంటర్ నంబర్ను అందరికీ కనిపించేలా ఉంచాలని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలపై టీవీల్లో, పత్రికల్లో జిల్లాల వారీగా ధరలను ప్రకటించాలని, విస్తృతంగా ఈ« దరలపై ప్రచారం చేయాలని సూచించారు.
ప్రతి సూపర్మార్కెట్ వద్దా, ప్రతి దుకాణం వద్ద కచ్చితంగా ధరల పట్టికను ఉంచాలని చెప్పారు. నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే జైలుకేనని సీఎం హెచ్చరించారు. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక, కాల్ సెంటర్ నెంబర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. దేశం మొత్తం లాక్డౌన్లో ఉంది, ఈ పరిస్థితిని అధిక ఆర్జనకోసం వినియోగించుకోవడం దారుణమని విమర్శించారు. దీనిని ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదని తేల్చి చెప్పారు.
దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చూడాలని, రేషన్ దుకాణాల వద్ద ఒకే లైను కాకుండా సామాజిక దూరం పాటించేలా మూడుకు మించి లైన్లు ఉండేలా చూడాలని సూచించారు. మొబైల్ వ్యాన్ల ద్వారా కూరగాయలు, నిత్యావసరాలు అమ్మడాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. ఓల్డేజ్ హోంలకు కావాల్సిన వాటిని అందించాలన్న సీఎం సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయ, ఆక్వా రంగ కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టం చేయారు.
మరింత పటిష్టంగా లాక్డౌన్ అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అర్బన్ ప్రాంతాల్లో లాక్డౌన్ సమయం కుదిస్తామని తెలిపారు. పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 నుంచి ఉదయం 11 వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. మిగతా ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి ఒంటిగంట వరకే అనుమతి ఇస్తామని చెప్పారు.
రైతులకు, ఆక్వా రైతులకు కనీస గిట్టుబాటు ధరలు అందాలని, వలస కూలీలు, కార్మికుల కోసం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. షెల్టర్లలో మెనూ ప్రకారం మంచి భోజనం పెట్టాలని జగన్ ఆదేశించారు.