Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె స్వరూపం మారుతుంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో గ్రామాల్లో అభివృద్ధి పనులు అంతంత మాత్రమే. ప్రత్యేకంగా నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. పోనీ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి అంటే అవి పక్కదారి పట్టేవి. సంక్షేమ పథకాల కోసం మళ్ళించేవారు. దీంతో ఒక్క పని అంటే ఒక్క పని చేసే స్థితిలో పంచాయతీలు ఉండేవి కావు. పంచాయితీల ఖాతాలు ఖాళీగా ఉండేవి. ఇటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వర్తిస్తుండడంతో.. పల్లె పాలనపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో ఏకకాలంలో 13 వేలకు పైగా పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. ప్రజోపయోగ పనులను గుర్తించారు. అయితే గ్రామసభల నిర్వహణ రికార్డులకు ఎక్కింది. ప్రపంచ రికార్డును నమోదు చేసింది.అయితే పనులు గుర్తించడమే కాదు.. ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్. ఈనెల 14 నుంచి పల్లె పండగ వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 20 లోగా గుర్తించిన పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సంక్రాంతి లోగా పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష జరిపిన డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
* గ్రామసభల్లో పనులు గుర్తింపు
రాష్ట్రంలో 13 వేలకు పైగా పంచాయతీలు ఉన్నాయి. గ్రామ సభల్లో దాదాపు 30 వేల వరకు పనులను గుర్తించారు. ఆ నివేదికలు ప్రభుత్వానికి అందాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 4500 కోట్ల రూపాయల నిధులు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే 2239 కోట్ల విలువైన 26,715 పనులకు అనుమతులు ఇచ్చారు. మిగిలిన పనులకు సైతం అనుమతులు ఇవ్వాలని కలెక్టర్లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.అయితే ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులు ఉపాధి హామీ పథకానికి సంబంధించినవి. పనుల్లో పారదర్శకత, ప్రజలకు జవాబుదారీతనం ఉండేలా వాటి పనులు పూర్తి చేయాలని పవన్ కలెక్టర్లను ఆదేశించారు.
* పంచాయితీల బలోపేతంపై ఫోకస్
పవన్ కళ్యాణ్ ఏరి కోరి గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకున్నారు. దానితో పాటు పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖలను సైతం దక్కించుకున్నారు. దాదాపు 100 రోజులు పాటు వాటిపై స్టడీ చేశారు. అయితే గ్రామీణ అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన పవన్.. పంచాయితీల బలోపేతంపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా గ్రామీణాభివృద్ధికి కేటాయించిన ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు పంచాయితీలకే దక్కాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే నిధులు విడుదల చేశారు. దీంతో గ్రామాల్లో ఒక రకమైన అభివృద్ధి కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. సంక్రాంతి నాటికి గ్రామాల రూపురేఖలు మారాలని భావిస్తున్నారు. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గట్టిప్రయత్నాల్లో ఉన్నారన్నమాట.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More