UPSC IFS Result: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. ఉత్తమ ర్యాంకులు సాధించారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 50 లోపు ర్యాంకుల్లో ముగ్గురు తెలుగువారు ఉన్నారు. ఈ సారి దేశవ్యాప్తంగా 147 మందిని ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాలకు యూపీఎస్సీ ఎంపిక చేసింది. అందులో 20 మంది వరకు ఏపీ, తెలంగాణకు చెందిన అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం. విజేతల్లో ఎక్కువ మంది సిలిల్స్కు సన్నద్ధమవుతున్నవారే. వీరిలో కొందరు ఏప్రిల్ 16న ప్రకటించిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ర్యాంకులు సాధించారు.
విజయనగరం వాసికి 22వ ర్యాంకు..
ఐఎఫ్ఎస్లో విజయనగరం జిల్లాకు చెందిన పోతుపురెడ్డి భార్గవ్ 22వ ర్యాంకు సాధించాడు. ఇతనికి సివిల్స్లో 590వ ర్యాంకు వచ్చింది. ఇక కడప జిల్లాకు చెందిన గోబ్బిళ్ల కృష్ణశ్రీవాత్సవ్ ఐఎఫ్ఎస్లో 52వ ర్యాంకు సాధించాడు. సివిల్స్లో 444వ ర్యాంకు సాధించాడు. విజేతలు తొలి మూడు నెలలు ముస్సోరిలో ఆ తర్వాత 15 నెలలు డెహ్రాడూన్లో శిక్షణ పొందుతారు.
మొదటి ప్రయత్నంలోనే 44వ ర్యాంకు..
ఇక తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన మన్నెం అజయ్కుమార్ తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్ఎస్లో 44వ ర్యాంకు సాధించాడు. ఐఐటీ ధన్బాద్లో ఎంటెక్ పూర్తిచేసిన అజయ్కుమార్ సొంతంగా సివిల్స్కు సన్నద్ధం అవుతున్నాడు. సివిల్స్ ప్రధాన పరీక్షలో రెండు మార్కులు తగ్గడంతో ఇంటర్వ్యూకు అర్హత సాధించలేదు. తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్ఎస్లో మంచి ఫలితం రావడంతో సంతోషంగా ఉందని ఐఏఎస్ సాధించడమేతన లక్షమని అజయ్కుమార్ తెలిపాడు.
74వ ర్యాంకు..
ఇక ఏపీ సచివాలయ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న తుమ్మల కృష్ణచైతన్య ఐఎఫ్ఎస్లో 74వ ర్యాంకు సాధించాడు. కృష్ణాజిల్లా బాపులపాడుకు చెందిన కృష్ణచైతన్యం నాలుగో ప్రయత్నంలో ఈ విజయం సాధించాడు. చిన్నచిన్న తప్పులతో సివిల్స్లో 4 మార్కులతో చేజారిందని తెలిపాడు.
106వ ర్యాంకు సాధించిన అనూష..
నల్గొండ జిల్లాకు చెందిన అనూష ఐఐటీ ముంబైలో 2012లో ఇంజినీరింగ్ పూర్తిచేసింది. 2018 నుంచి సివిల్స్కు ప్రిపేర్ అవుతోంది. తాజాగా ఐఎఫ్ఎస్లో 106వ ర్యాంకు సాధించింది. అనూష తండ్రి వెంకన్న ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. అనూష ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో దాతలు ముందుకు వచ్చారు. దీంతో ఆమె ఇంజినీరింగ్ పూర్తిచేసింది. జర్మనీలో 3 నెలలు ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేశారు. వివాహమై ఇద్దరు పిల్లలు కలిగాక సివిల్స్పై దృష్టిపెట్టారు. తల్లిదండ్రులు, భర్త వావళ్లపనల్లి రామకృష్ణ ప్రోత్సాహంతో ఐఎఫ్ఎస్ సాధిచారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More