ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 1146 అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు సింగరేణి సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
జూన్ నెల 28వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా https://scclmines.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏడాది కాలపరిమితితో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది.
ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్మెన్ (సివిల్), డీజిల్ మెకానిక్, వెల్డర్ ఉద్యోగ ఖాళీలు ఉండగా ఇంటర్మీడియట్ ఒకేషనల్ విద్యార్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండేళ్ల ఐటీఐ అభ్యర్థులకు నెలకి రూ.8050, ఏడాది ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ.7700 వేతనం చెల్లిస్తారు.
ఐటీఐ ఉత్తీర్ణతలో సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు మొదట https://apprenticeshipindia.org/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు త్వరగా దరఖాస్తు చేసుకుంటే మంచిది.