Chhattisgarh Serial Killer: ఫోరెన్సిక్ సినిమా చూశారా.. అందులో సైకో కిల్లర్ తాను చిన్నగా ఉన్నప్పుడే కోడి పిల్లలను బంధిస్తాడు. వాటిని అత్యంత క్రూరంగా చంపేస్తాడు. ఆ తర్వాత అదే ప్రయోగాన్ని మనుషుల మీద చేస్తుంటాడు. తనకు గిట్టని వాళ్ళ కదలికలను వాళ్లకు తెలియకుండానే పసిగడతాడు. ఆ తర్వాత అదును చూసి దాడి చేస్తాడు. చంపేసి.. ఆనవాళ్లు లేకుండా చేస్తాడు. సేమ్ ఇలాంటిదే చత్తీస్ గడ్ రాష్ట్రంలో జరిగింది. ఆ సైకో కిల్లర్ చేసిన దారుణాలు.. వెలుగులోకి వస్తుంటే పోలీసులకు మతి పోయినంత పని అయింది.
చత్తీస్ గడ్ రాష్ట్రంలో ఇటీవల బలోద బజార్ జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన రామ్ సహాయ్ జైస్వాల్ అనే వ్యక్తి కిరాణా దుకాణాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఇతడు సుహాగా అనే విషాన్ని వీధి కుక్కకు ఆహారంలో పెట్టాడు. అది తిన్న కుక్క చనిపోయింది. ఆ తర్వాత దాన్ని అతడు మనుషుల మీద కూడా ప్రయోగించడం మొదలుపెట్టాడు..
తనతో శత్రుత్వం కొనసాగించిన వారిని.. గొడవ పెట్టుకున్న వారిని.. అప్పులు ఇచ్చిన వారిని.. అనుచితంగా ప్రవర్తించిన వారిని జైస్వాల్ అంతం చేశాడు. బద్రి అనే వ్యక్తి హత్యతో తన నరమేధానికి శ్రీకారం చుట్టాడు జైస్వాల్. ఫిబ్రవరి 6న బద్రికి మద్యంలో విషం కలిపి తాగించాడు ఆ తర్వాత బద్రి చనిపోయాడు. ఫిబ్రవరి 20న కుల ఎన్నికలకు సంబంధించి వివాదాలు ఏర్పడిన నేపథ్యంలో.. బుతాలు అనే వ్యక్తిని హత్య చేశాడు. మార్చి 12న తన భార్య తో సంబంధం కొనసాగిస్తున్నాడని అనుమానంతో చట్టూ రామ్ అనే వ్యక్తిని విషం ఇచ్చి చంపాడు. మార్చి 20న ఒక భూ వివాదానికి సంబంధించిన కేసులో బుద్రం అనే వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని చంపేశాడు. మార్చి 31న వినోద్ కుమార్ అనే వ్యక్తితో వివాదాలు జరిగిన నేపథ్యంలో అతన్ని కూడా విషం ఇచ్చి చంపేశాడు. ఏప్రిల్ 28న గజానంద్ అనే వ్యక్తికి విషం ఇచ్చి చంపేశాడు. గజానంద్ తనకు క్షుద్ర పూజలు చేస్తున్నాడని.. ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నాడని అనుమానించి అతడిని చంపేశాడు.
జైస్వాల్ చైతురామ్ అనే వ్యక్తి దగ్గర 50,000 అప్పు తీసుకున్నాడు. ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వాలని చైతు రామ్ జైస్వాల్ మీద ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు. అతడికి డబ్బులు చెల్లించే ఉద్దేశం లేకపోవడంతో జస్వాల్ చైతురామ్ ను హత్య చేశాడు. ఆ తర్వాత అతనితో గొడవపడిన మహేతురు రామ్ అనే వ్యక్తిని మే 14న చంపేశాడు జైస్వాల్.
చనిపోయిన వారందరికీ జైస్వాల్ మద్యం తాగించేవాడు. అందులో ఈ ప్రమాదకరమైన విషం కలిపేవాడు. అది తాగిన తర్వాత వారంతా చనిపోయారు. అన్ని మరణాలు ఒకే విధంగా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అంతకంటే ముందు చనిపోయిన వారి అంత్యక్రియల్లో జైస్వాల్ పాల్గొనేవాడు. వారి కుటుంబ సభ్యులు ఏడుస్తుంటే ఓదార్చేవాడు. అంతేకాదు వారు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు. ఇలా తనపై అనుమానం రాకుండా జైస్వాల్ చూసుకున్నాడు. గ్రామస్తులతో కలిసి విచారం వ్యక్తం చేసేవాడు. దీంతో జైస్వాల్ మీద ఎవరికి అనుమానం రాలేదు.
కార్తీక్ అనే వ్యక్తిని కూడా చంపడానికి మద్యం లో విషం కలిపాడు. అయితే కార్తీక్ అపస్మారక స్థితికి చేరుకున్నప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. జైస్వాల్ తనకు ఆ పానీయం వల్లే ఇలా అయిపోయానని.. కార్తీక్ పోలీసులతో చెప్పడంతో.. వారికి అనుమానం మొదలైంది. మద్యం తాగించడానికి ముందు కార్తీక్ కు జైస్వాల్ ఫోన్ చేశాడు. ఆ తర్వాత అన్ని చావుల పరంపర ఒకే విధంగా ఉండడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. విచారణ జరుగుతున్నప్పుడు జైస్వాల్ మొదట నిరాకరించాడు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయాలను చెప్పాడు.
తనతో గొడవ పడిన వారిని.. క్షుద్ర పూజలు చేస్తున్న వారిని టార్గెట్ గా చేసుకున్నానని.. వారికి మందులో విషం కలిపి తాగించాలని జైస్వాల్ ఒప్పుకున్నాడు. మొత్తంగా పోలీసులు జైస్వాల్ మీద 8 హత్య కేసులు.. ఒక హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇన్ని మరణాలు జరుగుతున్నప్పటికీ అక్కడ గ్రామస్తులకు ఏదో జరుగుతోంది అనే అనుమానం మాత్రమే వచ్చింది.. అయితే చనిపోయిన వారు ముందుగా జైస్వాల్ ను కలవడం, కార్తీక్ అనే వ్యక్తికి ఫోన్ కాల్ చేయడంతో ఈ కేసులో పోలీసులకు క్లూ దొరికింది. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తే జైస్వాల్ మారణకాండ బయటపడింది.
