ఏపీ సీఎం జగన్ స్వతహాగా క్రైస్తవుడని ఇదివరకే ఒప్పుకున్నాడు. సాక్షాత్తూ సాక్షి దినపత్రిక ప్రారంభంలోనే తాను క్రైస్తవుడని జగన్ ప్రకటించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు.. క్రైస్తవుల పవిత్ర స్థలం జేరుసలేంకు నాడు వైఎస్ ఫ్యామిలీ మొత్తం వెళ్లి దర్శించుకుంది. విజయమ్మ చేతిలో అప్పుడప్పుడు శిలువ కనిపిస్తుంది. అయితే ఇది భారతదేశం.. అందరికి మతస్వేచ్ఛ ఉంటుంది. ఎవరు ఏ మతాన్ని అయినా అనుసరించవచ్చు. అందులో తప్పు లేదు. కానీ వేరొకరి మతాన్ని గాయపరిస్తేనే తప్పు.
Also Read: జగన్ తీసుకున్న ఆ నిర్ణయం మళ్లీ ఫెయిల్ కానుందా…?
కానీ ఎందుకోగానీ ఏపీ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హిందుత్వ మనోభావాలు దెబ్బతీసేలా పలు సంఘటనలు జరగడం ఆయనపై హిందుత్వ వ్యతిరేకిగా ముద్రపడడానికి కారణమైందనే ప్రచారం ఉంది. ప్రధానంగా కొన్ని హిందుత్వ సంఘాలు, ముఖ్యంగా టీడీపీ, బీజేపీలు ఏపీలో జరిగిన పలు సంఘటనలతో సీఎం జగన్ ను హిందూ వ్యతిరేకిగా ప్రచారం చేశాయి. అయితే జగన్ కావాలని హిందుత్వ వ్యతిరేక పనులు చేయకున్నా.. ఆయన పాలనలో అవి చోటుచేసుకోవడంతో ఆ ముద్రను వేసుకుంటున్నారు.
జగన్ హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించినప్పుడు పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఆయన టీటీడీ నిరర్థక ఆస్తులను అమ్మాలని చూడడంపై బీజేపీ, హిందుత్వ అభిమానులు గుర్రుగా ఉన్నారు.
ఇక చర్చి ఫాదర్లు, మసీదు ముల్లాలకు గౌరవ వేతనం ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది. ఆలయాలకు ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆదాయం వస్తుంది కానీ ఆదాయం రాని వారికి గౌరవ వేతనం ఇవ్వడాన్ని కొందరు ప్రశ్నించారు. బ్రహ్మణ కార్పొరేషన్ విషయంలో జగన్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న అర్చకుల విషయంలో అస్సలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇది హిందువుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.
ఇక పిఠాపురంలో అమ్మావారి విగ్రహాలు కూల్చివేతలో హిందుత్వ అభిమానులు మండిపడ్డారు. పవిత్ర సంగమంలో హారతి రద్దు, దేవాలయాల భూముల అమ్మకం, ఘాట్ల వద్ద పిండాలకు ధరలు పెంచడం.. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులకు బాధ్యతలు. ఇతర ప్రముఖ హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద దుమారమే రేపాయి.
జగన్ ప్రభుత్వంలోనే పలు హిందూ ఆలయాల్లో ధరలను పెంచడం కూడా వివాదాస్పదమైంది. తిరుపతినుంచి తిరుమల వెళ్ళే వాహనాల టోల్ ఛార్జీలు పెంపుదల.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వాహనాల పార్కింగ్ ఫీజు 20నుంచి రూ.50 పెంచడం.. పట్టిసీమ వీరభద్రస్వామి గుడికి నడిచి వెళ్తున్న భక్తులనుంచి రూ.20 వసూలు చెయ్యడం దుమారం రేపింది. నడిచి వెళ్ళేవాళ్ళనుంచి డబ్బు వసూలు చెయ్యడం ఏంటో దేవుడికే తెలియాలని అందరూ ఆడిపోసుకున్నారు. హిందూ పండగల సమయంలో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళే బస్సు ఛార్జీలు పెంచడం. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలచేత క్రైస్తవ మతానికి చెందిన పాటలు పాడించడం దుమారం రేపింది.
ఢిల్లీ నుంచి వచ్చిన ముస్లిములను కరోనా ఐసొలేషన్ లో ఉంచడానికి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని ఉపయోగించడం తీవ్ర దుమారం రేపింది.. అక్కడికి దగ్గర్లోనే ఇస్లామిక్ యూనివర్సిటీ ఉంది.ఐసొలేషన్ వార్డుగా దాన్ని వాడుకోవచ్చుకదా అని స్థానికులు ఆరోపించారు. హిందువులంతా కొలిచే తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వ్యాపార వస్తువుగా మార్చి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మడాన్ని బీజేపీ సహా హిందూ సంఘాలు ప్రశ్నించాయి.
Also Read: మరో సరికొత్త సంక్షేమ పథకం అమలు చేయబోతున్న జగన్?
అంతర్వేది రథం దగ్ధం సహా పలు హిందువుల మనోభావాలు దెబ్బ తిన్న ఘటనల్లో జగన్ సర్కార్ సరైన చర్యలు తీసుకోలేదని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతర్వేది రథం దగ్ధం విషయంలో ప్రభుత్వ ఉదాసీనత విమర్శల పాలైంది. హిందూ ఆలయాల విషయంలో ఎవరు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందనే దానిపై జగన్ ప్రభుత్వం దృష్టిసారించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
అయితే జగన్ పాలనలో కరోనా విషయంలో మంచి మార్కులు పడ్డా.. ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల ఆయన ప్రభుత్వంపై మరకపడింది. బీజేపీ, టీడీపీ, హిందుత్వ సంఘాలు ఈ ఘటనలను ఎత్తిచూపాయి. జగన్ స్వతహాగా ఇలాంటి వాటి విషయంలో సంయమనం పాటించినా..ఆయన ప్రభుత్వంపై డ్యామేజ్ మాత్రం బాగా జరిగింది. జగన్ సర్కార్ పై ఈ రకమైన ప్రచారం ఉవ్వెత్తున సాగింది. ఇక టీడీపీ బ్యాచ్ అయితే జగన్ టార్గెట్ గా ఇలాంటివెన్నో వండివర్చారనే ప్రచారం ఉంది. ఏదో మూల.. ఎవరో చేసినా ఇలాంటి నిర్ణయాలు అంతిమంగా జగన్ ప్రభుత్వంపై పడ్డాయి. జాతీయ స్థాయిలో జగన్ పై హిందుత్వ వ్యతిరేక ముద్రను కొందరు వేశారనే ప్రచారం ఉంది. మరి ఈ ముద్రను చెరిపేసుకోవడానికి జగన్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారన్నది వేచిచూడాలి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Anti hindu seal on ap cm ys jagan mohan reddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com