Undavalli criticizes Chandrababu: ఏపీలో( Andhra Pradesh) లడ్డూ వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్లో కూడా స్పష్టం చేసింది. సిబిఐ సైతం పామాయిల్ తో పాటు రసాయనాలతో కూడిన మిశ్రమాలు నెయ్యిలో కలిశాయని చెబుతోంది. అసలు పాలతో తయారు చేసిన నెయ్యి కాదని తేల్చేసింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వితండవాదం చేస్తోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే సీఎం చంద్రబాబు పైనే అనుచిత వ్యాఖ్యలు చేసే దాకా పరిస్థితి వచ్చింది. ఆయన అరెస్టు జరిగి రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు. ఇటువంటి సమయంలో పెద్దమనిషి పాత్ర పోషించాలనుకుంటున్న ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటివారు.. అదే అంబటి రాంబాబును జైల్లో పరామర్శించి.. బయటకు వచ్చి తిరిగి కూటమి ప్రభుత్వం పైన, సీఎం చంద్రబాబు పైన విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మంచి కోరుకునే వ్యక్తిగా మరోసారి తనను తాను నిరూపించుకున్నారు. ఆయన జైలుకు వెళ్లి పరామర్శించడంలో తప్పులేదు. కానీ లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు ప్రకటించడాన్ని తప్పుపడుతున్నారు. అలా చేయడం సీఎం స్థాయికి తగదన్నారు. అంటే కల్తీ జరిగిందన్న విషయం తెలిసినా.. మౌనంగా ఉండడమే మహత్కార్యంగా వర్ణించారు ఉండవల్లి అరుణ్ కుమార్.
అప్పట్లో చంద్రబాబు ఉన్నా..
రాజమండ్రి సెంట్రల్ జైల్లో( Rajahmundry Central Jail) రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో 52 రోజులపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆధారాలు లేని కేసుల్లో ఆయన బెయిల్ రాకుండా ఉండిపోయారు. రాజమండ్రిలో స్థానికంగా నివాసం ఉండే ఉండవల్లి అరుణ్ కుమార్ కనీసం చంద్రబాబు వైపు చూడలేదు కూడా. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు ఒక మహానేత అయినట్టు.. చాలా సౌమ్యుడుగా భావిస్తున్నట్టు.. చాలా తెలివైనవాడు అన్నట్టు గుర్తించి మరీ ఉండవల్లి అరుణ్ కుమార్ పరామర్శకు వెళ్లడం మాత్రం ఆయనలో ఉన్న జగన్ ఫేవర్ ను, ఫ్లేవర్ ను స్పష్టంగా కనిపించేటట్లు చేసింది.
అందరికీ తప్పు అనిపిస్తున్నా..
జగన్మోహన్ రెడ్డికి కష్టం వస్తే ఉండవెల్లి( Uandavalli Arun Kumar ) తట్టుకోలేరన్న సెటైర్లు ఎప్పటినుంచి ఉన్నాయి. తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి అన్ని వేళ్ళు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూపిస్తున్నాయి. చివరకు నేషనల్ మీడియా సైతం తీవ్రంగా తప్పుపడుతోంది. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ విచిత్ర వాదనతో తెర ముందుకు వచ్చారు. నెయ్యిలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉందని.. అయినా చంద్రబాబు ఎందుకు పదేపదే జంతు కొవ్వు ఉందని.. టాయిలెట్లు కడిగే కెమికల్ ఉందని చెబుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నిజాలు బయట పెట్టడాన్ని తప్పుపడుతున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. దానిని తప్పుగా అభివర్ణిస్తున్నారు. ఎన్డిడిబి రిపోర్టులో ఉన్న వాటినే చంద్రబాబు చెప్పారన్న విషయాన్ని మరిచిపోతున్నారు. సీఎం స్థాయి వ్యక్తి అంటూ.. ఆ విషయం చెప్పడమే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కల్తీ విషయం బయట పెట్టకుండా ఉంటే అదే మహాపరాధం. అయినా ఉండవల్లి వారి మాటలకు అర్ధాలే వేరులే అన్నట్టు సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.