CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పై ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వానికి మించి రెట్టింపు పథకాలను అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచి పెడతామని కూడా హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 80 రోజులు అవుతోంది. సామాజిక పింఛన్లను మూడు వేల నుంచి 4 వేల రూపాయలకు పెంచి గత రెండు నెలలుగా అందించారు. అన్నట్టుగానే అన్న క్యాంటీన్లను తెరిచి పేదలకు మూడు పూటలా 15 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు. డీఎస్సీలో పోస్టులు పెంచారు. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ ప్రకటించలేదు. ఒక వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టారు చంద్రబాబు. ముఖ్యంగా పారిశ్రామిక విధానంతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటించారు. తద్వారా పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 10 అంశాలకు సంబంధించి పెద్ద పీట వేస్తూ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు.
* శ్రీ సిటీ అభివృద్ధికి చర్యలు
ఇటీవలే తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీని సందర్శించారు చంద్రబాబు. ఒకేసారి పదుల సంఖ్యలో పరిశ్రమలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు కూడా చేశారు. శ్రీ సిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కేవలం పారిశ్రామిక ప్రాంతంగానే కాకుండా.. నివాసయోగ్యమైన ప్రాంతంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల వసతులు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే పరిశ్రమలు ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తరించాలన్నది చంద్రబాబు ప్లాన్. అందుకు అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు.
* కొత్తగా ఈ రంగాలకు
కొత్త పారిశ్రామిక విధానంలో సాధారణ పరిశ్రమల కంటే.. వివిధ రంగాల్లో పరిశ్రమలను ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మస్యూటికల్స్, బయోటెక్నాలజీ, టెక్స్ టైల్స్, పాదరక్షలు, తోలు, బొమ్మలు మరియు ఫర్నిచర్, పెట్రో కెమికల్స్, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్, ఆటోమొబైల్స్ మరియు భాగాలు, యంత్రాలు, ఖచ్చితమైన పరికరాలు మరియు ఖనిజ ఆధార పరిశ్రమలకు పెద్ద పీట వేసే విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని చంద్రబాబు తీర్చిదిద్దారు.
* చిన్న తరహా పరిశ్రమలకు ఊతం
అయితే పెద్ద తరహా పరిశ్రమలతో పాటు మధ్యతరహా, చిన్న పరిశ్రమలకు సంబంధించి చేయూతనివ్వాలన్న ఉద్దేశంతోనే ఈ పది అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు చంద్రబాబు. ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకుగాను భూ కేటాయింపులతో పాటు రాయితీలు అందించేందుకు సైతం ప్రభుత్వం ముందుకు వచ్చింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధానాన్ని ప్రవేశపెట్టింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు కూడా భూమితో పాటు రాయితీలు అందించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా పరిశ్రమల ఏర్పాటు అనేది భారీ పారిశ్రామికవేత్తలకే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, నిరుద్యోగ యువకులకు సైతం ప్రోత్సాహం అందించినట్టు అవుతుందన్నది చంద్రబాబు ప్లాన్.తద్వారా పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు చూపించినట్టు అవుతుందని.. సరికొత్తగా పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More