Pawankalyan Varahi Yatra : వారాహి పాదయాత్రకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 14న వారాహి పాదయాత్ర ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలివిడతగా చేపట్టనున్న యాత్ర అన్నవరంలో ప్రారంభమై భీమవరంలో ముగియనుంది. కాగా యాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా జనంలోనే ఉండేందుకు పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు. యాత్రతో సమరశంఖం పూరించనున్నారు. కాగా రెండురోజుల ముందే పవన్ అమరావతికి చేరుకోనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో హోమాలు, పూజలు చేపట్టనున్నారు. అనంతరం సత్యదేవుని సన్నిధిలో పూజలు జరిపి వారాహి రథం ఎక్కనున్నారు.
వారాహి యాత్ర కోసం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఇంచార్జులను ప్రకటించారు. వారు ఏర్పాట్లలో తనమునకయ్యారు. జనసేన పార్టీకి ఉభయగోదావరి జిల్లాల్లో పట్టు ఎక్కువ. అస్సలు జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదు. పవన్ వస్తున్నారంటే కిలోమీటర్ల పొడవునా వెయిట్ చేసే ఫ్యాన్స్ జనసేన సొంతం. ఫలానాతేదీన పవన్ వస్తున్నారంటే.. ఫ్యాన్స్ వెల్లువలా వస్తారు. అటువంటిది ఎన్నికల కోసం వారాహి యాత్రకు వస్తున్నారు అంతే ఫ్యాన్స్ ఆ సందడే వేరు. యాత్రతో పవన్, జనసేన గ్రాఫ్ అమాంతం పెరిగే చాన్స్ ఉంది.
మరో వైపు మెగా బ్రదర్ నాగబాబు వారాహి యాత్రపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచారు. ప్రధాన కార్యదర్శి హోదాలో అందర్నీ మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోంది. జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, జనసేన శ్రేణులు సమిష్టిగా, సమాలోచనలతో వారాహి యాత్రను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నానని ఆయన ప్రత్యేకంగా పత్రికలకు, మీడియాకు ప్రకటన విడుదల చేశారు. రాజకీయం అనే పదాన్ని అడ్డు పెట్టుకొని కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, వర్గాలుగా విడదీస్తూ.. ఒక్కో పార్టీ, ఒక్కో నాయకుడు వారికి ఇష్టమొచ్చిన రీతిలో వాడేసుకుంటున్నారని.. ఆ పరిస్థితిని పవన్ కల్యాణ్ మారుస్తారని ప్రకటించారు.
యాత్రకు ముందే పవన్ సీఎం నినాదాన్ని జనాల్లోకి వదిలారు. పవన్ ఒక వ్యక్తిగానే వేలాది మందికి ఆపన్నహస్తం అందిస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే శక్తిని అందజేస్తే ఇంకెంతో మందికి ఉపయోగకరమైన సేవలు అందిస్తారు అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుందని నాగబాబు ప్రకటనలో పేర్కొన్నారు. పవన్ నిరంతరాయంగా యాత్ర చేయాలన్న ఉద్దేశంలో ఉన్నారని చెప్పారు. రూట్ మ్యాప్ ప్రస్తుతానికి గోదావరి జిల్లాలకే ఖరారు చేసినా.. ఇదే స్పీడులో ఏపీ వ్యాప్తంగా ఫిక్స్ చేయడానికి జనసేన నాయకత్వం సిద్ధమైంది. మొత్తానికైతే పవన్ తన యాత్రతో ఏపీ రాజకీయాల్లో గట్టి సంకేతాలే ఇవ్వనున్నారు.