Church Pastor warning to Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan) సనాతన ధర్మం వ్యాఖ్యలు చేస్తే రియాక్ట్ తమిళనాడు నుంచి వచ్చేది. తమిళనాడు నేతలు విపరీతంగా స్పందించేవారు. కానీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం స్పందిస్తున్నారు. అదే సమయంలో కొంతమంది అన్య మతస్తులు సైతం వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తాజాగా ఓ పాస్టర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేరుగా పవన్ కళ్యాణ్ ను హెచ్చరిస్తూ చంపేస్తాం అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల క్రమంలో.. ఇప్పుడు మతాల పైన.. మత విశ్వాసాల పైన నేరుగా కొంతమంది వ్యాఖ్యానాలు చేసి అలజడి సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పాస్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఎన్నెన్నో వివాదాస్పద అంశాలు..
ప్రస్తుతం రాష్ట్రంలో ఒక రకమైన వాతావరణం నడుస్తోంది. తిరుమలలో లడ్డు తయారీకి సంబంధించిన నెయ్యి కల్తీ వ్యవహారం ఏపీ రాజకీయాలను షేక్ చేసింది. అయితే దీనిపై అధికార ప్రతిపక్ష గట్టిగానే వాదనలు సాగుతున్నాయి. ముఖ్యంగా హిందుత్వవాదంపై కూడా చర్చ నడుస్తోంది. అయితే టీటీడీ లడ్డు వివాదం ప్రారంభం నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ అవసరం అని అభిప్రాయపడ్డారు. మిగతా మత విశ్వాసాలు గౌరవిస్తున్నట్టే.. హిందూ మత విశ్వాసాలు, ఆపై హిందూ పరిరక్షణ కోసం ఒక బలమైన వ్యవస్థ అవసరం అని అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్. అలాగని మిగతా మతాలకు హిందూ మతం వ్యతిరేకం కాదు అని తేల్చి చెప్పారు. అయితే ఈ సనాతన ధర్మ కామెంట్స్ పై తమిళనాడు సమాజం నుంచి ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయి. అక్కడి నేతలు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.
Also Read: నిరుద్యోగులకు ఉగాది రోజున గుడ్ న్యూస్!
వైసిపి పై వ్యతిరేక ప్రచారం..
అయితే ఏపీలో సైతం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై అనేక రకాల విమర్శలు చేస్తూ వచ్చారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇప్పటికే వైసీపీ పై అన్యమత ముద్ర ఉంది. ఇటువంటి సమయంలో ఓ పాస్టర్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అంటే మహిళలను మోసం చేయడమేనని.. కుటుంబ సభ్యులను మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే మెడ నరికేస్తాను అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఒక ముద్ర ఉంది. ఈ పాస్టర్ వ్యాఖ్యల వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కచ్చితంగా ఇది ఆ పార్టీకి నష్టం చేసే విషయం. అయితే అందుకు సరైన ధ్రువీకరణ లేదు కానీ.. మీడియాతో పాటు సోషల్ మీడియాలో మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఆ పార్టీ మేల్కొని ప్రత్యేక ప్రకటన చేస్తేనే మేలు.