Nara Lokesh TDP Leadership Changes: తెలుగుదేశం ( Telugu Desam) పార్టీలో కొత్త తరానికి నాయకత్వం వచ్చింది. మూడో తరం నేత నారా లోకేష్ కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కింది. ఇప్పటికే పార్టీ బాధ్యతలు మోస్తున్నారు లోకేష్. ఇప్పుడు అధికారికంగా అప్పగించారు చంద్రబాబు. ఇక చంద్రబాబు గౌరవ పాత్రకే పరిమితం అవుతారు. అన్ని రకాల నిర్ణయాలు లోకేష్ తీసుకుంటారు. అయితే కేవలం లోకేష్ మాత్రమే కాదు తన టీమ్ ను సైతం రంగంలోకి దించేశారు. అనధికారికంగా కొందరికి బాధ్యతలు అప్పగించడంతో సీనియర్లు రుస రుసలాడారు. దానికి విరుగుడుగా ఇప్పుడు లోకేష్ టీంకు తెలుగుదేశం పార్టీ కార్యవర్గాల్లో సముచిత స్థానం దక్కింది. కేవలం లోకేష్ ను ఉద్దేశించి.. పార్టీకి యువ రక్తం ఎక్కించే క్రమంలో కొత్త కార్యవర్గాలు ఎంపిక జరిగింది. పొలిట్ బ్యూరోలో కూడా నడి వయస్కులను తీసుకున్నారు. దాదాపు సీనియర్లను పక్కన పెట్టారు. కేవలం కొద్ది మందిని మాత్రమే కొనసాగించారు.
* కిలారి రాజేష్ కు ప్రమోషన్..
జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కింజరాపు రామ్మోహన్ నాయుడు( kinjarapur Ram Mohan Naidu ), బైరెడ్డి శబరి, కిలారి రాజేష్ లను తీసుకున్నారు. ఈ ముగ్గురు నారా లోకేష్ కు అత్యంత సన్నిహితులు. కేవలం లోకేష్ ను దృష్టిలో పెట్టుకొని.. తెలుగుదేశం పార్టీ భావి అవసరాలకు గాను ఈ ముగ్గురిని ఎంపిక చేశారు. అయితే ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో పాటు కిలారి రాజేష్ కు ప్రాధాన్యం ఇవ్వడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. కిలారి రాజేష్ లోకేష్ తో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్నారు. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. మొన్న చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా కిలారు రాజేష్ పేరు ప్రముఖంగా వినిపించింది. 2014లో లోకేష్ తో పాటు తెరవెనుక ఎంట్రీ ఇచ్చారు రాజేష్. అయితే రాజేష్ విషయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ మధ్యన ప్రచారం నడిచింది. ఇప్పుడు ఏకంగా పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించడం ద్వారా.. లోకేష్ టీమ్ నెంబర్ అని గట్టి సంకేతాలు పంపగలిగారు.
* పొలిట్ బ్యూరోలోకి ద్వితీయ శ్రేణి నేత..
విజయనగరం( Vijayanagaram) జిల్లాకు చెందిన ఓ ద్వితీయ శ్రేణి నాయకురాలను ఏకంగా పార్టీలో అత్యంత విధానపరమైన నిర్ణయాలు తీసుకునే.. పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. గజపతినగరం మాజీ ఎంపీపీ గంటేడ శ్రీదేవి ప్రస్తుతం మండల టిడిపి అధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమెను ఇప్పుడు ఏకంగా టిడిపి పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడం చూస్తుంటే మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమెనే కాదు 50 ఏళ్ల లోపు ఉన్న వారిని ఈసారి పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడం గమనార్హం. గతంలో చంద్రబాబుతో పని చేసిన వారిని పక్కన పెట్టారు. అలాగని సీనియర్ల వారసులు ఉంటే వారిని కమిటీల్లో చేర్చారు. మొత్తానికి అయితే తెలుగుదేశం పార్టీలో లోకేష్ టీం ఇప్పుడు రంగంలోకి దిగింది. ఇప్పటివరకు తెరవెనుకకే పరిమితమైన ఈ బృందం.. ఇప్పుడు అధికారికంగా పదవులు దక్కించుకొని పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు అవకాశం కలిగింది.