Modi Instagram Reel: నీట్ పరీక్షా పేపర్ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కాక్రోజ్ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తోంది. జూలై 21న విద్యార్థులు పార్లమెంటువైపు దూసుకురావడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో ఆందోళన మరింత ఉధృతమైంది. ఈ నేపథ్యంలో జూలై 23 అర్ధరాత్రి పరీక్ష పేపర్ లీకేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఇన్స్టాగ్రామ్ సెల్ఫీ రీల్ అనూహ్య స్థాయిలో వైరల్ అయింది. గురువారం అర్ధరాత్రి పోస్ట్ చేసిన ఈ వీడియో కేవలం 24 గంటల్లోనే 303 మిలియన్ వ్యూస్ను దాటి ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన ఇన్స్టాగ్రామ్ రీల్గా నిలిచింది. ఇంతకుముందు IShowSpeed ఖాతాలో నమోదైన 300 మిలియన్ వ్యూస్ రికార్డును అధిగమించింది. ప్రస్తుతం వ్యూస్ సంఖ్య 325 మిలియన్కు చేరుకుంది. ఈ రీల్కు 1.6 కోట్లకు పైగా లైక్లు, 15 లక్షలకు పైగా కామెంట్లు వచ్చాయి.
యువతకు ధైర్యం ఇచ్చేలా సందేశం…
‘‘ఫ్రెండ్స్, పేపర్ లీక్లు సాధారణ విషయం కాదు. లక్షలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇది చాలా బాధాకరం’’ అని ప్రధాని స్పష్టం చేశారు. గత రెండున్నర నెలల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ, దోషులను అరెస్టు చేసి జైలులో పెట్టినట్లు తెలిపారు. విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా వెంటనే రీ–ఎగ్జామ్లు నిర్వహించినట్లు గుర్తు చేశారు. కొత్త కఠిన బిల్లును వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు, క్యాబినెట్లో చర్చించనున్నట్లు ప్రకటించారు. ఈ సందేశం యువతలో భారీ స్పందనను సష్టించింది. ఒక్క రాత్రిలోనే ప్రధాని ఇన్స్టాగ్రామ్ ఖాతాకు దాదాపు 10 లక్షల కొత్త ఫాలోవర్లు చేరి మొత్తం సంఖ్య 10.1 కోట్లకు చేరుకుంది.
యువత సూచనలకు మోదీ ధన్యవాదాలు..
శుక్రవారం రాత్రి ప్రధాని మరో ఫాలో–అప్ రీల్ను విడుదల చేశారు. ‘థాంక్యూ ఫ్రెండ్స్. నిన్న రాత్రి మీతో మాట్లాడే అవకాశం దొరికింది. మీరు వీడియోకు ఇచ్చిన స్పందన, సానుకూల సూచనలకు ధన్యవాదాలు. మీ అభిమానం నన్ను ప్రేరేపిస్తూనే ఉంటుంది. మన బంధం మరింత బలపడుతుంది’ అని పేర్కొన్నారు. యువత అందించిన అభిప్రాయాలను ప్రశంసిస్తూ ఈ వీడియోను పోస్ట్ చేశారు.
కొత్త కఠిన చట్టం సిద్ధం..
శుక్రవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) చట్టం 2024కు సవరణలు ఆమోదం పొందాయి. సంఘటిత పేపర్ లీక్ రాకెట్లకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కనీస శిక్షను 5 ఏళ్లకు పెంచడం వంటి అంశాలు కూడా చేర్చారు. ఈ బిల్లును సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ మాన్సూన్ సెషన్లో ప్రవేశపెట్టనున్నారు.
పేపర్ లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, యువతతో నేరుగా సంభాషించే ప్రయత్నం ఈ రీల్ ద్వారా స్పష్టమైంది. ఇదే సమయంలో సీజేపీ ఆందోళనలను మించి మోదీ వీడియోకు వ్యూస్ రావడం సంచలనంగా మారింది.
View this post on Instagram







