Andhra Pradesh : సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక రకమైన చులకన భావం. అక్కడ పెద్దగా సౌకర్యాలు ఉండవు. విద్యా బోధన ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్టు ఉండదు అనేది ఒక విమర్శ. కానీ గత కొన్ని రోజులుగా ప్రభుత్వ పాఠశాలలు సైతం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మారుతున్నాయి. వసతుల్లోనూ, విద్యా బోధనలోనూ, ఉత్తీర్ణత శాతంలోనూ మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. అందుకే ప్రభుత్వ పాఠశాలల వైపు తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తమ పిల్లలను చేర్పిస్తున్నారు. గత రెండు రోజులుగా విశాఖలోని చంద్రంపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ట్రెండింగ్ లో నిలిచింది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తరగతి గదులు, క్రీడా ప్రాంగణాలు, ప్రయోగశాలలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్ననే వాటన్నింటినీ ప్రారంభించారు నారా లోకేష్.
* మూడుసార్లు పాఠశాలకు లోకేష్..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడుసార్లు ఆ పాఠశాలను సందర్శించారు. విశాఖ నగరంలో ఉన్న ఈ పాఠశాల లో ప్రస్తుతం మూడు వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. 110 మందికి పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 62 తరగతి గదులు ఉన్నాయి. అయితే ఇక్కడి పాఠశాలను చూసి సమూల మార్పులు చేయాలనుకున్నారు లోకేష్. సామాజిక బాధ్యతగా పరిశ్రమలు కేటాయించే నిధులను ఇక్కడ ఖర్చు చేశారు. ప్రభుత్వం సైతం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంతో.. మొత్తం 6 కోట్ల 50 లక్షల పైచిలుకు నిధులతో.. చేపట్టిన నిర్మాణాలు పాఠశాల స్వరూపాన్ని మార్చేసాయి. ఆ ప్రాంగణంలో అడుగుపెడితే కార్పొరేట్ విద్యాసంస్థ అన్నట్టు ఉంటుంది అక్కడి పరిస్థితి.
* పెద్ద ఎత్తున ప్రచారం..
మంత్రి నారా లోకేష్ ఇక్కడి నిర్మాణాలను ప్రారంభించారు. విద్యార్థులతో ముచ్చటించారు. తాను మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని.. కనీసం అక్కడి పాఠశాలను సందర్శించిన దాఖలాలు లేవని.. కానీ చంద్రంపాలెం ప్రభుత్వ పాఠశాలకు మూడుసార్లు వచ్చానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని ది బెస్ట్ స్కూల్ అంటూ కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పక్క వారికి సాయం అందించి వారి అభివృద్ధిలో పాలుపంచుకుంటే కచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని విద్యార్థులతో ముచ్చటిస్తూ అన్నారు నారా లోకేష్. అయితే భారీ నిర్మాణాలతో.. చంద్రంపాలెం ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ లుక్ సాధించడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది.