Chandrababu Naidu Telangana visit: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్. ప్రధాని నరేంద్ర మోడీతో సమకాలీకులు. ఆయన కంటే ముందుగానే ముఖ్యమంత్రి అయ్యారు. ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు చంద్రబాబు. ఎన్నెన్నో సంక్షోభాలను దాటుకొని ఈ స్థాయికి ఎదిగారు. అయితే ఆయనకు ఒక లోటు ఉంది. తెలంగాణ సమాజంలో ఆయన వ్యతిరేకిగా ముద్రపడ్డారు. అలా ముద్ర వేసింది కేసీఆర్. తెలంగాణ సమాజంలో ఒక విలన్ గా చిత్రీకరించారు. చివరకు ఆయన ద్వారా రాజకీయ లబ్ధి పొందిన నేతలు సైతం ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోయారు. చివరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్ధకంగా మారింది. తెలంగాణ ప్రజల గుండెల్లో ఒక విష బీజం నింపారు చంద్రబాబుపై. అయితే ఇప్పుడిప్పుడే అక్కడి ప్రజలతో పాటు నేతలు వాస్తవాలు గుర్తిస్తున్నట్టున్నారు. అందుకే చంద్రబాబు విషయంలో వారు ఆలోచన మార్చుకున్నారు. నేతలు ఏ నోటితో తిట్టారో.. ఇప్పుడు వారే చంద్రబాబు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వైరల్ అంశంగా మారింది.
టిడిపి పై ముద్ర..
తెలుగుదేశం( Telugu Desam) పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు. కానీ ఆయన కంటే టిడిపి పై చంద్రబాబు ముద్ర అధికం. ఆ పార్టీ అధినేతగా దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా వ్యవహరించారు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా.. నవ్యాంధ్రప్రదేశ్ కు ఏడేళ్ల ముఖ్యమంత్రిగా.. అంతకుమించి ప్రతిపక్ష నేతగా అనుభవం చంద్రబాబుది. అయితే తెలంగాణ వ్యతిరేక ముద్ర అనేది చంద్రబాబుపై ఒక పద్ధతి ప్రకారం మోపడంలో సక్సెస్ అయ్యారు కెసిఆర్. తెలుగుదేశం పార్టీ నేతలను ఆకర్షించారు కూడా. అయితే చంద్రబాబు పట్ల కృతజ్ఞత ఉన్నా రాజకీయ భవిష్యత్తు కోసం చాలామంది నేతలు తెలుగుదేశం పార్టీని వీడారు. గులాబీ పార్టీలో చేరి పెద్ద పదవులు అనుభవించారు. కానీ వారు ఎవరు చంద్రబాబు నాయకత్వాన్ని మరిచిపోలేకపోయారు. అంతలా ముద్ర వేశారు ఏపీ సీఎం చంద్రబాబు.. పార్టీ పరంగా చంద్రబాబును విభేదించేవారు వ్యక్తిగతంగా మాత్రం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే అది ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.
చంద్రబాబు కాలికి నమస్కారం..
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్( Bandla Ganesh) కుమార్తె వివాహ నిశ్చితార్థం నిన్ననే జరిగింది. కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. అయితే ఇదే వేడుకలకు గులాబీ పార్టీ నేతలతో పాటు తెలంగాణలో వివిధ పార్టీల్లో ఉన్న నాయకులు హాజరయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎదురుపడ్డారు. వినమ్రతతో కాలికి నమస్కరించారు. అటు తర్వాత మైనంపల్లి హనుమంతరావు కూడా కాలికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు చంద్రబాబు నుంచి. వారిద్దరే కాదు చాలామంది నాయకులు అలానే చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు విషయంలో తెలంగాణ సమాజంలో మార్పు వచ్చిందనడానికి ఈ వీడియోలే సాక్ష్యం.