Can Jagan change Amaravati capital: అమరావతి రాజధానికి( Amravati capital ) కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. అందుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. త్వరలో రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అయితే దీనిపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆ బిల్లును మార్చేస్తాం అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు బిల్లు పెట్టిన మాదిరిగానే.. తాము చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. అప్పటినుంచి ఆయనకు అనుకూలురు సైతం అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే అది సాధ్యమేనా అన్న ప్రశ్నకు కొంతమంది విశ్లేషకుల ముసుగులో సాధ్యమే అని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. అది ప్రజలతో ముడిపడే విషయం కాగా.. మరోవైపు కోర్టు పరిధిలో కూడా ఉంది. ఈ విషయం తెలియక చాలామంది విశ్లేషణల రూపంలో ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నారు.
అవన్నీ జరిగితేనే..
అమరావతి మార్పు విషయంలో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) చెబుతున్న మాటలను పరిగణలోకి తీసుకుంటే.. ముందుగా ఆయన అంతులేని విజయం సాధించాలి. ఆయనకు అనుకూలమైన ప్రభుత్వం కేంద్రంలో రావాలి. అప్పుడే ఆ బిల్లు మరోసారి మార్పునకు కొంతవరకు అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు కూడా అది రాజకీయ అంశంగా మారనుంది. ఎందుకంటే అప్పటికి అమరావతికి ఒక రూపం వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం జరుగుతుంది. వాటిని మారిస్తే మాత్రం ప్రజావ్యతిరేకత రావడం ఖాయం. ఎందుకంటే ఏ రాష్ట్రం కూడా రాజధానిని మార్పు చేస్తున్న దాఖలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి పదేపదే రాజధానులను మారిస్తే ప్రజలు ఊరుకోరు. రాజకీయాలు విపరీతంగా ప్రభావితం అవుతాయి కూడా. జాతీయస్థాయిలో జగన్మోహన్ రెడ్డి నవ్వుల పాలవుతారు కూడా. ప్రస్తుతం జగన్ వైఖరి చూస్తుంటే మారుస్తాం అని చెప్పడం లేదు. కేవలం అమరావతి విషయంలో దూకుడుగా ప్రభుత్వం ముందుకెళ్తున్న వేళ.. కొంత రాజకీయ అయోమయం సృష్టించేందుకే ఈ ఎత్తుగడ అని స్పష్టం అవుతుంది.
అప్పుడే ఏం చేయలేకపోయారు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఏపీలో తిరుగులేని విజయం సాధించింది. అప్పుడే అమరావతి స్థానంలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. కానీ అప్పటికే ఏపీ రాజధాని అమరావతి అని రికార్డుల్లో నమోదయింది. ఆయన మూడు రాజధానుల ప్రయత్నం చేస్తున్న సమయంలోను కేంద్ర ప్రభుత్వ రికార్డుల ప్రకారం అమరావతి రాజధాని అని తేలిపోయింది. మరి అంతటి బలంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఒప్పించలేకపోయారు. పాలన వికేంద్రీకరణ కోసమే తాను మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నానని చెప్పలేకపోయారు. ఎందుకంటే అప్పుడు 22 మంది పార్లమెంట్ సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. తనకు విలువనిచ్చే ఎన్ డి ఏ ప్రభుత్వం ఉంది. పైగా తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుకు కేంద్ర పెద్దలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ సమయంలోనే తాను పట్టుబడి తెరపైకి తెచ్చిన మూడు రాజధానులను అమలు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి.
న్యాయస్థానాల్లో అడ్డంకులు..
మరోవైపు న్యాయ చిక్కులను కూడా అధిగమించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. అమరావతిని కాదని మూడు రాజధానుల అంశాన్ని తీసుకున్నప్పుడు ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించారు అమరావతి రైతులు. వారిని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు. కేసులతో ఉక్కిరి బిక్కిరి చేశారు. రాజధాని అంటే ఆ 29 గ్రామాలకు సంబంధించిన అంశంగా భావించారు. కానీ అమరావతి రైతులు న్యాయ పోరాటం చేశారు. ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు డివిజనల్ బెంచ్ అమరావతి రైతులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో ఇష్టపడని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సుప్రీం కోర్టులో ఆ కేసు పెండింగ్లో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చట్టపరంగా మూడు రాజధానుల విషయంలో తనకు ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించింది. ఎందుకంటే అమరావతి రాజధాని విషయంలో రైతులతో ఒప్పందం ప్రధాన అడ్డంకి కానుంది. అందుకే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా.. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. కేవలం కోర్టులో ప్రతికూలత వస్తుందని భావించి అప్పట్లో ఆ నిర్ణయం తీసుకుంది.
సుప్రీం కోర్టులో ఆఫిడవిట్..
తాజాగా అమరావతికి చట్టబద్ధత అనే అంశం తెరపైకి వచ్చినప్పుడు.. విశ్లేషకుల ముసుగులో కొందరు వైసిపి అనుకూలురు కొత్త ప్రతిపాదన తెచ్చారు. పార్లమెంటులో చట్టబద్ధత కంటే రాష్ట్ర ప్రభుత్వ పరంగా సుప్రీంకోర్టులో ఉన్న కేసును వెనక్కి తీసుకోవచ్చు కదా అనేది వారి సూచన. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పని చేసింది. అమరావతి ఏకైక రాజధాని అంటూ ఆఫిడవిట్ దాఖలు చేసింది. కానీ సుప్రీం కోర్టులో ఆ కేసు విచారణకు రాలేదు. ఒకవేళ వచ్చినా హైకోర్టు అమరావతికి అనుకూల తీర్పు ఇచ్చిన దృష్ట్యా దానికే కట్టుబడి ఉండాలని ఆదేశాలు ఇస్తుందని న్యాయ నిపుణులు సైతం చెబుతున్నారు. ఒకసారి సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చిందంటే మరోసారి.. అమరావతి రాజధాని మార్పు అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉండదు. అయితే రాజకీయపరంగా చాలా రకాల వ్యాఖ్యలు చేయవచ్చు కానీ.. కొన్నింటిని అధికారంలోకి వచ్చాక అమలు చేయలేం. ఇప్పుడు అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఎదురైన పరిస్థితి అదే. అంతులేని మెజారిటీతో ఆయన గెలవాలి. ఆయనకు అనుకూలమైన కేంద్ర ప్రభుత్వం రావాలి. ఆపై సంకీర్ణ ప్రభుత్వంలో మిగతా రాజకీయ పార్టీలు సహకరించాలి. ఇంత జరిగిన తరువాత మాత్రమే రాజధానిని కదిలించగలరు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇంతకుముందే అంతులేని మెజారిటీతో గెలిచిన ఆయన అమరావతిని అంగుళం కదిపించలేకపోయారు. ఒకవేళ అధికారంలోకి వచ్చినా ఆయన అమరావతిని కొనసాగించాలి తప్ప వేరే ఆప్షన్ లేదన్న టాక్ కూడా ఉంది. సో ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలంతా కేవలం రాజకీయ గందరగోళం కోసమేనని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. అమరావతి శాశ్వతం అంటున్నారు.
