AP house plot registrations: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యకు మోక్షం కల్పించింది. గ్రామకంఠం భూములు, ఇళ్ల స్థలాలకు సంబంధించి యాజమాన్య హక్కులను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వెబ్ లాండ్ రికార్డుల్లో గ్రామ కంఠంగా నమోదైన ఆస్తుల రిజిస్ట్రేషన్ కు లైన్ క్లియర్ చేస్తూ రెవెన్యూ శాఖ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త నిర్ణయంతో రాష్ట్రంలో లక్షలాదిమందికి గ్రామకంఠం భూములు, ఇళ్ల స్థలాలకు యాజమాన్య హక్కులు రానున్నాయి. రిజిస్ట్రేషన్లకు సైతం అడ్డంకి తొలగనుంది. ఇది ప్రజలు హర్షించే పరిణామమే.
నిషేధిత జాబితాలో ఉన్న..
ప్రభుత్వం తాజా మార్గదర్శకాల ప్రకారం ఒక సర్వే నంబర్ తో ఉన్న గ్రామ కంఠం భూమి.. సెక్షన్ 22 ఏ కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న.. తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయవలసిందే. గత మాదిరిగా అధికారుల ధ్రువీకరణ పత్రం అవసరంలేదు. ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉంటే చాలు. నిరభ్యంతరంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరపాలి అనేది ప్రభుత్వ తాజా ఆదేశం. గతంలో సబ్ డివిజన్ ప్రక్రియ పూర్తిగా జరగలేదు. ఒక సర్వే నెంబర్ నిషేధిత జాబితాలో ఉంటే.. దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇప్పుడు అన్ని చిక్కుముడులు విడిపోయినట్లు అయింది. కేవలం సామాజిక అవసరాలకు కేటాయించిన భూములు మినహా వ్యక్తిగత ఆస్తులతో పాటు ఇల్లు రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం అయింది. గత నివాస ప్రాంతాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
* గ్రామ కంఠంలో ఉన్న భూములు, ఇళ్లకు సంబంధించి భారీ మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. వీటి రిజిస్ట్రేషన్లకు లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు. స్థానిక సంస్థలు జారీ చేసే ఇంటి పన్ను రసీదు ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది.
* గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఖాళీ స్థలానికి రసీదు లేకపోయినా పరవాలేదు. అమ్మకం దారుడు, కొనుగోలుదారుడు స్వయం డిక్లరేషన్ ఇస్తే చాలు. దానిని తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్ శాఖతో పాటు రెవెన్యూ శాఖకు తాజాగా ఆదేశాలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ సమస్యపై లక్షలాది మంది ఎదురుచూస్తుండగా సానుకూలంగా స్పందించింది ఏపీ ప్రభుత్వం.
