China : తుఫాన్ వచ్చి ముంచిందని కాదు వారి బాధ.. సెల్ ఫోన్ చార్జింగ్ కోసం చైనీయుల తిప్పలివీ

చైనాలో యాగి తుఫాను విధ్వంసాన్ని సృష్టించింది. దంచి కొట్టిన వానలతో చైనా ప్రజలు ఇబ్బంది పడ్డారు. గాలుల ధాటికి విద్యుత్ సరఫరా అస్తవ్యస్తమైంది. తాగునీటి సరఫరా నిలిచిపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 13, 2024 12:05 pm

China Yagi Thoopan Effect

Follow us on

China : విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేంతవరకు ప్రజల కోసం అయినా ప్రభుత్వం అక్కడక్కడ సెల్ ఫోన్ తాత్కాలిక చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసింది. వాటి వద్ద ప్రజలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తున్నాయి. చైనాలోని హైనాన్ ప్రావిన్స్ లో యాగి తుఫాన్ వల్ల బలమైన గాలులు వీచాయి. విస్తారంగా వర్షాలు కురిసాయి. దీంతో సెల్ ఫోన్ లలో చార్జింగ్ నిండుకుంది. దీంతో డిజిటల్ పేమెంట్స్ జరిపే వీలు లేక ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారని గ్లోబల్ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ప్రజల కష్టాలను గుర్తించి అప్పటికప్పుడు తాత్కాలికంగా సెల్ ఫోన్ చార్జింగ్ స్టేషన్లను దేశంలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసింది. దీంతో ప్రజలు తమ సెల్ ఫోన్లు చార్జింగ్ పెట్టుకునేందుకు వాటి వద్ద బారులు తీరి కనిపించారు. ఈ దృశ్యాలను గ్లోబల్ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. చైనాలో యాగి తుఫాను విపరీతమైన నష్టాన్ని కలగజేసిందని తన కథనాలలో పేర్కొంది. ఈ తుఫాన్ వల్ల చైనాలోని చాలా ప్రాంతాలు ప్రభావితమయ్యాయని.. బలమైన గాలులు వీయడం వల్ల పెద్ద పెద్ద భవనాలు కూడా ధ్వంసం అయ్యాయని వివరించింది. దానికి సంబంధించిన దృశ్యాలను ప్రసారం చేసింది.

వియత్నాం దేశంలోనూ..

ఇక చైనాలో యాగి తుఫాను సృష్టించిన విధ్వంసం.. వియత్నాం దేశాన్ని కూడా వదిలిపెట్టలేదు. తుఫాన్ ప్రభావం వల్ల వియత్నాం దేశంలో వరదలు సంభవించాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 197 మంది చనిపోయారు. ఇందులో 125 మంది జాడ తెలియ రాలేదు. ఉత్తర వియత్నాం దేశంలోని లావో కై ప్రావిన్స్ లోని లాంగ్ గ్రామం వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. ఆ గ్రామంలో ఇప్పటివరకు ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే వరదలు తగ్గిన తర్వాత ఇంకా చాలామంది మృతదేహాలు బయటపడతాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. వరదల వల్ల ప్రభావితమైన ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే వాతావరణం లో చోటు చేసుకున్న విపరీతమైన పరిణామాల వల్లే యాగి వంటి బలమైన తుఫాన్లు ఏర్పడుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారంగా చెట్లను నరకడం.. పెరిగిపోతున్న కాలుష్యం.. పారిశ్రామికీకరణ వంటివి వాతావరణంలో మార్పులకు కారణమవుతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. మొక్కలను నాటి.. సంరక్షించడమే ఈ సమస్యకు పరిష్కార మార్గమని వారు వివరిస్తున్నారు. యాగీ తుఫాన్ తర్వాత తాత్కాలిక చార్జింగ్ స్టేషన్లలో ప్రజలు బారులు తీరి కనిపిస్తున్న తర్వాత “తుఫాన్ వచ్చి ముంచిందని కాదు వారి బాధ.. సెల్ ఫోన్ చార్జింగ్ కోసం చైనీయుల తిప్పలివీ” అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.