Texas H1B Teachers: అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లాలి.. అక్కడే ఉన్నత చదువులు చదవాలి.. వీలైతే ఉద్యోగం పొంది డాలర్లు సంపాదించాలి.. ఉద్యోగం వచ్చాక అక్కడే స్థిరపడాలి అనే ఆలోచన భారతీయ యువతలో మొన్నటి వరకు ఎక్కువగా ఉండేది. కానీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక పరిస్థితి మారింది. అమెరికా ఫస్ట్ నినాదం, విదేశీ వలసలపై ఆంక్షలు, అక్రమంగా ఉంటున్నవారిపై కఠిన చర్యలు, విదేశీయులకు ఉద్యోగాలు ముఖ్యంగా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని ఆయన ట్రంప్ చేసిన ఆదేశాలు అమెరికా కలలను కల్లలు చేశాయి. దీంతో అమెరికాకు ప్రత్యామ్నాయం వెతుక్కుటున్నారు.
టెక్సాస్ గవర్నర్ కీలక నిర్ణయం..
ట్రంప్ నిర్ణయాల కొనసాగింపు అన్నట్లుగా టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్–1బి వీసా ద్వారా ఉపాధ్యాయులను నియమించడాన్ని పూర్తిగా ఆపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఈ వీసాతో నియమించిన ఉపాధ్యాయులను తొలగించాలని స్పష్టం చేశారు. హెచ్–1బి వ్యవస్థను సమర్థవంతంగా నియంత్రించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
సిబ్బంది కొరత నేపథ్యం
టెక్సాస్లోని కొన్ని పాఠశాలలు ముఖ్యంగా ద్విభాషా విద్య వంటి కీలక విభాగాల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. దానిని తీర్చుకోవడానికి హెచ్–1బి వీసాలను ఉపయోగిస్తున్నాయి. డల్లాస్ స్వతంత్ర పాఠశాల జిల్లాలో 171 మంది ఇలాంటి ఉద్యోగులు ఉన్నారు. ఇది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యధిక సంఖ్య. దేశవ్యాప్తంగా చూస్తే టెక్సాస్లోనే హెచ్–1బి వీసా ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉంది.
గవర్నర్ ప్రతిపాదన ఇలా..
గవర్నర్ అబాట్ ప్రతిపాదన ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్నవారిని తొలగించాలి. భవిష్యత్తులో దరఖాస్తు చేసుకునేవారిపైనా ఈ నిబంధన వర్తించాలి. అయితే ఇది చట్టంగా మారాలంటే వచ్చే సంవత్సరం టెక్సాస్ శాసనసభ ఆమోదం అవసరం. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చర్యను తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
విద్యార్థులకు సవాళ్లు..
ఒకవైపు సిబ్బంది కొరతను తీర్చడంలో హెచ్–1బి వీసాలు సహాయపడుతున్నాయి. మరోవైపు స్థానిక ఉపాధ్యాయుల ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయనే వాదనలు ఉన్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ద్విభాషా తరగతులు, ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల విభాగాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రం స్వయంగా ఉపాధ్యాయుల శిక్షణ, నియామకాలపై దృష్టి సారించే అవకాశం కూడా పెరుగుతుంది.
టెక్సాస్ ప్రభుత్వం ఈ అంశాన్ని రాష్ట్ర హక్కుల పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. కేంద్ర వీసా విధానాలపై నియంత్రణ లేకపోవడం వల్ల రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకోవాల్సి వస్తోందని గవర్నర్ అబాట్ వాదన. శాసనసభ చర్చల్లో ఈ ప్రతిపాదన ఎలా ముందుకు సాగుతుందో, విద్యా రంగంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.