Modi And Elon Musk: డిజిటల్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఎలన్ మస్క్కు భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. “దేశ చట్టాలకు లోబడి ఉండాల్సిందే” అని ప్రధాని మోడీ సర్కార్ పదే పదే హెచ్చరించినప్పటికీ, స్వేచ్ఛా వ్యక్తీకరణ పేరుతో మొండికేసిన మస్క్, చివరకు భారత నిబంధనల ముందు తలవంచక తప్పలేదు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ లో అసభ్యకర, అశ్లీల కంటెంట్పై భారత్ ఉక్కుపాదం మోపడంతో మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు.’
Also Read: తెలంగాణ రాష్ట్ర ఖజానా ‘నిల్’నా?
ఏం జరిగింది?
భారత్లో పెరుగుతున్న అశ్లీల వెబ్సైట్ల ప్రభావం, మహిళలపై జరుగుతున్న డిజిటల్ దాడులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ‘ఎక్స్’ వేదికగా సాగుతున్న అడల్ట్ కంటెంట్పై కేంద్రం సీరియస్ అయ్యింది. దీనిపై ఎక్స్ సంస్థకు చెందిన ఏఐ చాట్బాట్ ‘గ్రోక్’ సంచలన విషయాన్ని బయటపెట్టింది. “మార్చి 3, 2026 నుంచి భారత్లో పరస్పర సమ్మతితో రూపొందించిన అడల్ట్/సె*క్షువల్ వీడియోలను జియో-బ్లాక్ చేస్తున్నాం. ఇది భారత ప్రభుత్వ అసభ్య కంటెంట్ నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా తీసుకున్న చర్య” అని గ్రోక్ స్పష్టం చేసింది.
మస్క్ మొండితనం.. మోడీ సర్కార్ వ్యూహం
గతంలో పలుమార్లు కంటెంట్ నియంత్రణ విషయంలో ఎలన్ మస్క్ భారత ప్రభుత్వంతో విభేదించారు. అయితే, ఇంటర్నెట్ భద్రత, సామాజిక విలువల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేయడంతో, ‘ఎక్స్’ యాజమాన్యం వెనక్కి తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా అడల్ట్ కంటెంట్కు అనుమతి ఉన్నప్పటికీ కేవలం భారత్లో మాత్రమే దీనిని బ్లాక్ చేయడం గమనార్హం.
కీలక మార్పులు ఇవే..
జియో-బ్లాకింగ్ చేయడం ద్వారా భారత ఐపీ అడ్రస్ల నుంచి అడల్ట్ వీడియోలు చూసే అవకాశం ఇక ఉండదు. ఇతర దేశాల్లో ఈ కంటెంట్ అందుబాటులో ఉన్నా.. అది కేవలం ‘సెన్సిటివ్’ ట్యాగ్తో మాత్రమే కనిపిస్తుంది. భారత ఐటీ చట్టాలను ఉల్లంఘించే ఏ కంటెంట్నైనా తక్షణమే తొలగించేలా వ్యవస్థను మార్చారు.
భారతీయ సాంస్కృతిక విలువలు మరియు మహిళల గౌరవానికి భంగం కలిగించే కంటెంట్పై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెజారిటీ నెటిజన్లు స్వాగతిస్తున్నారు. డిజిటల్ స్వేచ్ఛ ఉండాలి కానీ, అది హద్దులు దాటకూడదనే హెచ్చరికను ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. ‘ఎక్స్’ తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.