
Buggana Rajendranath: తాగుడు ఓ కళ అంటారు మందుబాబులు.. అది తాగుబోతులకే తెలుస్తుందంటారు ఓ పెగ్గేశాక.. తాగే విధానాన్ని బట్టి వివిధ రకాలుగా వర్ణిస్తారు ఇంకో రెండు పెగ్గులు వేశాక. ఇవీ మనకు సాధారణంగా తెలిసిన కళాత్మక మద్యపానం. కానీ, రెస్పాన్సిబుల్ డ్రింకింగ్… బాధ్యతాయుదమైన తాగుడు.. ఈ మాట ఇటీవల చాలా ఫేమస్ అయింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా వాడిన పదమిదీ. కానీ బాధ్యతాయుతమైన మద్యపానం అనే మాట మొదట వాడింది మహిళా హక్కుల పత్రిక ‘మానుషి’ ఎడిటర్, జర్నలిస్ట్ మధు పూర్ణిమా కిష్వర్. పంజాబీ ఖత్రీ కుటుంబంలో పుట్టిన ఈ దిల్లీ ఉద్యమకారిణి దాదాపు పదేళ్ల క్రితం ఓ పత్రికలో రాసిన వ్యాసంలో ‘రెస్పాన్సిబుల్ డ్రింకింగ్’ అంటే ఏమిటి? తాగుబోతులు ఎవరు? తాగుతూ తూలుతూ గృహహింసకు, బహిరంగ హింసకు ఎవరు పాల్పడతారు? ఒళ్లు మరిచిపోకుండా, బుర్ర ఆరోగ్యకరంగా పనిచేసేలా మద్యం తాగడం సమాజానికి నష్టం ఎందుకు కాదు? వంటి విషయాలను చర్చిస్తూ ఈ వ్యాసం రాశారు. ఢిల్లీకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత సామాజిక శాస్త్రాల పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్ డీఎస్)లో ఆమె అధ్యాపకురాలు. 2014 లోక్ సభ ఎన్నికలకు ముందు మధు కిష్వర్ తోటి పంజాబీ జర్నలిస్టు తవ్లీన్ సింగ్తోపాటు కాంగ్రెస్– యూపీఏ ఓటమిని కోరుకుంటూ, నరేంద్రమోదీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. 2002 గుజరాత్ అల్లర్లలో సీఎం మోదీ పాత్ర ఏమీ లేదనీ, విశ్వహిందూ పరిషత్ అప్పటి అధ్యక్షుడు ప్రవీణ్ తొగడియా వంటి హిందుత్వ గుజరాతీ పటేళ్లదే ముస్లింల ఊచకోత పాపమని ఆమె నమ్మారు. ఈ మేరకు ఆమె అనేక పరిశోధనాత్మక వ్యాసాలు కూడా రాశారు.
ప్రియాంకా వాడ్రాపై డ్రింకింగ్ ఆరోపణలు..
2014 లోక్ సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రధాని కావాలని ఉద్యమించి బీజేపీకి గట్టి మద్దతు పలికారు డాక్టర్ సుబ్రమణ్యంస్వామి. నోటి దురుసు, పదును ఉన్న డాక్టర్ స్వామి నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ వాడ్రాపై విరుకుపడ్డారు. గుజరాత్ లోని వడోదరాతోపాటు యూపీలోని వారాణాసి నుంచి కూడా పోటీచేసిన నరేంద్రమోదీపై కాంగ్రెస్ తరఫున ప్రియాంక తలపడతారని వార్తలొచ్చాయి అప్పట్లో. దీనిపై స్పందిస్తూ, ‘నిజంగా ప్రియాంక వారణాసి నుంచి బరిలోకి దిగితే జనం ఆమెను వెంటపడి కొడతారు. ఎందుకంటే ప్రియాంక ఆల్కహాల్ తాగుడు చాలా ఎక్కువ. చెడ్డపేరు కూడా ఉంది,’ అని సుబ్రమణ్యంస్వామి వ్యాఖ్యానించారు. దీనిపై మధు కిష్వర్ స్పందిస్తూ, ‘‘ఆల్కహాల్ తాగడం వేరు. తాగుబోతుగా మారి ఒళ్లు తెలియకుండా ప్రవర్తించడం వేరు. ప్రియాంకను స్వామి తాగుబోతు అని వర్ణించారు,’’అంటూ ట్వీట్ చేశారు.
తాగుడు తప్పే కాదన్నట్లు..
ఇక మధు కిష్వర్ తన వ్యాసంలో కూడా కాళ్లపై మిగతా శరీరం, భుజాల మధ్యన తల నిటారుగా నిలబడేలా చూసుకుని మద్యం తాగితే తప్పేలేదని అభిప్రాయపడ్డారు. హింస, దౌర్జన్యం, అడ్డగోలు ప్రవర్తనకు ఆస్కారం లేని తాగుడు మంచిదేనని, ఈ తాగుడు బాధ్యతాయుతమైనదని పేర్కొన్నారు.

ఇప్పుడు ఏపీ మంత్రి..
ఇక కర్నూలు జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి తాత (తల్లి తండ్రి) ప్రసిద్ధ తెలుగు సినీ దర్శకుడు కేవీ.రెడ్డి. బుగ్గన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ, బళ్లారి విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఈ లెక్కన ఈ రాయలసీమ మంత్రి గారికి మధు కిష్వర్కు ఉన్నంతటి సామాజిక చైతన్యం, న్యూఢిల్లీలో నివసించిన నేపథ్యం లేకపోయినాగానీ ‘రెస్పాన్సిబుల్ డ్రింకింగ్’ అంటే ఏమిటో కొంతైనా తెలుసని అర్థమవుతోంది. అందుకే బడ్జెట్ ప్రసగంలో ఈ పదాలను రెస్పాన్సిబుల్గా వాడినట్లు తెలుస్తోంది.