RTC Conductor : పురిటి నొప్పులు ఎప్పుడు సడెన్గా వస్తాయో ఎవరూ ఊహించలేరు. ప్రయాణిస్తున్న బస్సు, ట్రైన్, విమానంలో కూడా మహిళలు డెలివరీ అవుతుంటారు. అయితే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా తెలంగాణలో జరిగింది. గద్వాల డిపోకి చెందిన బస్సులో ఈ ఘటన జరగడంతో చాకచక్యంగా ఆ బస్సు కండక్టర్ వెంటనే ఆపి మార్గమధ్యంలోనే ఆమెకు డెలివరీ చేశారు. పూర్తి వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గద్వాల డిపోనకు చెందిన బస్సు గద్వాల-వనపర్తి రూట్లో వెళ్తుంది. ఈ పల్లె వెలుగు బస్సులో ఈరోజు ఉదయం సంధ్య అనే గర్భిణి ప్రయాణిస్తోంది. రక్షాబంధనన్ కారణంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తేందుకు బస్సులో ప్రయాణిస్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి వచ్చిన వెంటనే ఆమెకు ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. దీంతో వెంటనే ఆ బస్సు కండక్టర్ భారతి ఒక పక్కకి బస్సు ఆపించారు. ఆ బస్సులో ఓ నర్సు కూడా ప్రయాణిస్తోంది. ఆమె సాయంతో గర్భిణికి ఇద్దరు కలిసి డెలివరీ చేశారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.
డెలివరీ తర్వాత అంబులెన్స్కి కాల్ చేసి తల్లీబిడ్డను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. రాఖీ పౌర్ణమి రోజున గర్భిణికి డెలివరీ చేసిన కండక్టర్ భారతికి టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రశంసించింది. నర్సు సాయంతో సరైన సమయానికి డెలివరీ చేయడం వల్ల ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వాళ్లను అభినందించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆ మహిళా కండక్టర్కు అభినందనలు తెలిపారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా సామాజిక బాధ్యతగా వాళ్లకు సాయపడటమనేది గొప్ప విషయమని ఎక్స్ ద్వారా తెలిపారు. భారతిని సభాష్ అంటూ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా కండక్టర్ భారతిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రయాణిస్తున్న బస్సులో ఇలా గర్భిణికి పురుడు పోయడం అనేది గొప్ప విషయమని అందరూ అభినందిస్తున్నారు. సమస్య వస్తే చాకచక్యంతో ఆలోచించి పరిష్కరించాలి. ఆందోళన చెందితే సరిగ్గా చేయలేరు. ఈ కండక్టర్ అసలు కొంచెం కూడా టెన్షన్ పడకుండా బుద్ధిబలంతో గర్భిణికి డెలివరీ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఇలానే బుద్ధిబలంతో వ్యవహరించాలి. మీరు ప్రయాణించే చోట ఎక్కడైనా ఇలాంటి సంఘటన జరగవచ్చు. అలాంటి సమయంలో భయపడకుండా ఆలోచించి జాగ్రత్తపడితే మిమ్మల్ని కూడా ప్రశంసించే రోజులు వస్తాయి.