MS Dhoni: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ జట్టుకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. చెన్నై జట్టును ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిపిన చరిత్ర ధోనికి ఉంది. ధోనికి ఇప్పుడు 40 కి పైగా సంవత్సరాలు. అయినప్పటికీ అతడు చెన్నై జట్టులో కొనసాగుతున్నాడు. చెన్నై జట్టు తరపున అతడు ప్రత్యక్షంగా ఆడలేక పోతున్నప్పటికీ.. జట్టులో ఉంటున్నాడు.
అతడు ఆడకపోయినప్పటికీ జట్టులో కనిపిస్తే చాలు అని అభిమానులు చాలామంది ఉన్నారు. పైగా ధోనిని చెన్నై అభిమానులు తలా అని ముద్దుగా పిలుస్తుంటారు. గడచిన 18 సంవత్సరాలుగా ధోని చెన్నై జట్టుతో తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. చెన్నై జట్టుకు ధోని గత సీజన్లో తాత్కాలిక సారధిగా వ్యవహరించాడు. ఇటీవల సీజన్లో ధోని గాయం తగ్గకపోవడంతో చెన్నై జట్టు తరఫున మైదానంలోకి దిగలేదు. దీంతో ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను చెన్నై యాజమాన్యం ఎప్పటికప్పుడు ఖండించుకుంటూ వచ్చింది.
తాజాగా చెన్నై విషయంలో ధోని కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త క్రీడా వర్గాలలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. వాస్తవానికి చెన్నై జట్టును.. ధోనిని విడదీసి చూసే అవకాశం ఉండదు. ఆ జట్టుకు ఎన్నో ట్రోఫీలు అందించిన చరిత్ర ధోనికి ఉంది. అయితే చెన్నై జట్టు విషయంలో మహి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. చెన్నై జట్టులో 25% వాటా కొనుగోలు చేస్తానని యాజమాన్యానికి ధోని తెలిపారని తెలుస్తోంది. అయితే కేవలం మూడు శాతం మాత్రమే విక్రయిస్తామని చెన్నై యాజమాన్యం ధోనికి చెప్పినట్టు సమాచారం అయితే ధోని 20 శాతానికి ఆపై 18 శాతానికి తగ్గాడు. చెన్నై యాజమాన్యం 5.5% మాత్రమే ఫైనల్ అని తేల్చినట్టు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. దీంతో చెన్నై జట్టుతో ధోని సంబంధాలు దెబ్బ తిన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. నేషనల్ మీడియాలో కూడా ఇదే తీరుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే గనుక నిజమైతే దాదాపు 18 సంవత్సరాల అనుబంధానికి ధోని ముగింపు పలికినట్టే.
చెన్నై జట్టుతో ధోని కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. యజమాన్యం.. ధోనిమధ్య ఏర్పడిన వివాదం సమసి పోవాలని అభిమానులు కోరుతున్నారు.” ధోని చెన్నై జట్టులో ఉండాలి.. అతడు చెన్నై జట్టులో ఆడాలి. అతడు ఆడితేనే బాగుంటుంది. అతడు చెన్నై జట్టులో లేకపోతే దానికి విలువే ఉండదు” అని చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. మరి ధోని ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సి ఉంది.