Homeజాతీయ వార్తలుKCR vs BJP: రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న బీజేపీ ప్లాన్ లో కేసీఆర్ భాగమా?

KCR vs BJP: రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న బీజేపీ ప్లాన్ లో కేసీఆర్ భాగమా?

KCR vs BJP: ఏమో గుర్రం ఎగురావచ్చు.. బీజేపీ చేతిలో ‘కేసీఆర్’ పావుగా మారనూ వచ్చు.. ఏదైనా జరగొచ్చు. రాజకీయా చదరంగంలో అందరూ పావులే.. గెలుపు అవసరాలే నేతలను అలా మారుస్తాయి.. అందులో ప్రత్యర్థిని చిత్తు చేయాలంటే ఎన్ని ఎత్తులైనా వేయాలి. అపర చాణక్యుడులాంటి కేసీఆర్ ఎత్తులు అంత ఈజీగా అర్థం కావంటారు. ఇక రెండు సార్లు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీఆర్ఎస్ లకి మూడోసారి గెలవడం అంత ఈజీ కాదు.. ఈసారి మిత్రుల అవసరం ఎంతైనా ఉంది. పెల్లుబుకుతున్న వ్యతిరేకతతో సీట్లు తగ్గడం ఖాయం. అప్పుడు కొత్త పొత్తులు చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు చెడిపోయిన సంబంధాలను పునరుద్దరించడం.. కొత్త మిత్రులను సమపార్జించుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో సాగుతున్న పరిణామాలు చూస్తుంటే.. కాంగ్రెస్ ను చావుదెబ్బ తీసేందుకు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ వ్యూహాత్మకంగా కదులుతున్నాయా? అంటే ఔననే అనుమానిస్తోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలోనే కాదు.. జాతీయస్థాయిలో కాంగ్రెస్ ను బలపడకుండా దెబ్బతీసేందుకు కొత్త పార్టీలతో కొత్త ఎత్తులు వేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

 

-ఢిల్లీలో కౌగిలించుకునే మోడీ, కేసీఆర్ లు.. తెలంగాణ గల్లీలోకి వచ్చేసారికి ఎందుకు కలహించుకుంటున్నారు?
మోడీ, కేసీఆర్ లు ఎప్పుడు కలహించుకుంటారో.. ఎప్పుడు ఆప్యాయంగా మాట్లాడుకుంటారో తెలియదు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ‘రామానుజ ’ విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ ఈనెల 5న తెలంగాణకు వస్తున్నారని.. ఇంత తిడుతున్న మీరు ప్రధానిని ఆహ్వానిస్తారా? అని ఓ లేడీ విలేకరి కేసీఆర్ ను ప్రశ్నించింది. దానికి నింపాదిగా సమాధానమిచ్చిన కేసీఆర్ ‘ప్రోటోకాల్ అండీ.. రాజకీయం వేరు.. మర్యాద వేరు.. ప్రధాని వస్తే వెళ్లి స్వాగతించొద్దా?.. ఆయనతో పాటు హెలిక్యాప్టర్ లో ప్రయాణిస్తాం.. అప్పుడు కూడా మా డిమాండ్లను ప్రశ్నిస్తాం’ అంటూ తమ మధ్య ఉన్నది వైరమా? మిత్రత్వమా? అన్నది తెలియకుండా కేసీఆర్ అందరినీ కన్ఫ్యూజ్ చేశారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. కేసీఆర్ ది పైకి బీజేపీపై పగ.. లోపల స్నేహం అన్న అనుమానాలు కలుగక మానవు. రాష్ట్ర ప్రయోజనాలంటూ ప్రధాని మోడీని కలుస్తానంటున్న కేసీఆర్.. ఆయనను ప్రెస్ మీట్ లో అంతగా తిట్టడం ఏంటో అర్థం కావడం లేదు. ఎవరైనా తిట్టాక కలవడానికి మొహం చెల్లదు.. కానీ కేసీఆర్ ప్రధానిని కలుస్తానంటున్నాడు. దీన్ని బట్టే కేసీఆర్ బీజేపీతో చేసేది రణమా? శరణమా? అర్థం కావడం లేదంటున్నారు.

– రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న బీజేపీ ప్లాన్ లో కేసీఆర్ భాగమా?
ప్రస్తుతం ఉన్న భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి, దేశానికి సరికొత్త రాజ్యాంగాన్ని మళ్లీ రాయాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్‌రావు పిలుపునివ్వడం నిజానికి ఆయన ఆలోచన కాదట.. ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన ఆలోచన అట.. దీన్ని కేసీఆర్ ద్వారా లేవనెత్తి అమలు చేయించే ఎత్తుగడను వేశారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. “కొత్త రాజ్యాంగాన్ని రాయడం ఒక విచిత్రమైన వెర్రి ఆలోచన. కేసీఆర్ కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులను.. ముఖ్యంగా నరేంద్ర మోదీ ఆలోచనలను అమలు చేసే ఒక పావుగా మాత్రం సరికొత్త వాదన తెరపైకి తెచ్చారని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని తొలగించేందుకు బీజేపీ మొదటి నుంచి కుట్రలు చేస్తోందన్నారు. ‘‘బీజేపీ ఆలోచన విధానాన్ని కేసీఆర్ ప్రతిబింబించారు. నిజానికి బీజేపీ నాయకత్వమే కేసీఆర్ ద్వారా దాన్ని తెరపైకి తెచ్చింది’’ అని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

-పైకి తిట్లు.. లోపల బీజేపీతో కేసీఆర్ స్నేహం చేస్తున్నారా?
నిజానికి పైకి తిట్లు తిడుతూ.. లోపల బీజేపీతో కేసీఆర్ స్నేహం చేస్తున్నారని కాంగ్రెస్ అనుమానిస్తోంది. తెలంగాణలో ఎదుగుతున్న కాంగ్రెస్ ను తొక్కేసేందుకు ఈ ప్లాన్ వేసినట్లుగా కాంగ్రెస్ వాదులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎజెండాను కేసీఆర్ ముందుకు తీసుకెళుతున్నారని.. వాళ్ల ప్లాన్ లు అమలు చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న ప్రస్తుతం ఉన్న రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా దేశంలో రాష్ట్రపతి పాలనను తీసుకురావాలని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు లేకుండా చేయాలని బీజేపీ యోచిస్తోందని పీసీసీ చీఫ్ కామెంట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని పావుగా మార్చి ఇలా వాదన తెరపైకి తెచ్చారని రేవంత్ రెడ్డి లాజిక్ బయటకు తీశారు.

-కేసీఆర్ కొత్త యుద్ధం వెనుక అసలు కారణాలేంటి?
బీజేపీపై యుద్ధం అంటూ కేసీఆర్ పై మొదలుపెట్టిన ఈ తతంగాన్ని అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ నాయకులు తొడులు కొట్టుకుంటూ పతాక స్థాయికి తీసుకెళ్లి సీరియస్ గా స్పందిస్తున్నా.. కాంగ్రెస్ కు మాత్రం ఎక్కడో డౌట్ కొడుతోంది. కొత్త రాజ్యాంగం ఎత్తుగడను పెట్టుబడిదారులు, భూస్వాములు, అగ్రవర్ణాల ప్రయోజనాలను కాపాడేందుకే కేసీఆర్‌-బీజేపీ కలిసి తెరపైకి తెచ్చాయని కాంగ్రెస్ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపు కూడా ఇచ్చారు. జాతీయస్థాయిలోనూ కాంగ్రెస్ సీనియర్లు కేసీఆర్-బీజేపీ బంధంపై ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారట..

రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లోనూ లాజిక్ ఉంటుంది. బీజేపీ ఇప్పటికే చాలా కొత్త చట్టాలు తెచ్చి వ్యతిరేకత తెచ్చుకొని చేతులు కాల్చుకుంది. అందుకే ఏ కొత్తది చేయాలన్నా ముందుగా రాష్ట్రాలు, ప్రజలు, నాయకుల నుంచి డిమాండ్ వస్తే చేయడం ఈజీ అని ఈ కొత్త ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే సీఏఏ, సాగు చట్టాలు సహా కొన్ని బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు బెడిసికొట్టాయి. వాటిని వెనక్కి కూడా తీసుకుంది. అందుకే ముందుగా కేసీఆర్ వంటి బలమైన సీఎంలతో ఈ కొత్త రాజ్యాంగం వాదన తెరపైకి తీసుకొస్తున్నారా? అన్న అనుమానాలు లేకపోలేదు. రేంత్ రెడ్డి మాటలను బట్టి అదే అర్థమవుతోంది. మరి నిజంగానే కేసీఆర్-బీజేపీ ప్లాన్ లో ఇది భాగమా? లేక నిజంగానే కేసీఆర్ బీజేపీపై ఫైట్ చేస్తాడా? అన్నది మున్ముందు తేలనుంది.

 

For LIVE News, National Updates, India News Watch:

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular