Telugu Community America: ఈ దేశం ఏగినా.. ఎందు కాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండు గౌరవం.. ఈ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుస్తాయి కదా. చిన్నప్పుడు పాఠశాలల్లో మైక్ లలో ఈ పాట పదేపదే వేసేవాళ్ళు .
జాతిని జాగృతం చేయడంలో.. ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఇటువంటి గీతాలు కీలకపాత్ర పోషిస్తాయి. అదృష్టవశాత్తు ఇటువంటి గీతాలను రచించింది మన తెలుగు వాళ్ళు. నాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని.. తెల్లవాళ్ళకు వ్యతిరేకంగా పనిచేశారు తెలుగు వాళ్ళు. ఆంగ్లేయుల పరిపాలనను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ సాహిత్యం రూపొందించారు. ఆ సాహిత్యమే తెలుగు రాష్ట్రాల నుంచి ఆంగ్లేయులను బయటికి వెళ్లగొట్టగలిగింది.
అంతటి చైతన్యాన్ని.. అంతటి స్ఫూర్తిని కలిగి ఉన్న తెలుగు వాళ్ళు అదే స్థాయిలో ఐకమత్యంగా ఉండక.. కులాల పేరుతో.. మతాల పేరుతో విడిపోవడం నిజంగా ఆందోళన కలిగిస్తోంది. చివరికి దేశాలు దాటినప్పటికీ.. ఖండాలను దాటినప్పటికీ తెలుగు వాళ్లకు ఇంకా ఆ కుల పిచ్చి పోకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. అసలు ఎక్కడో అమెరికాకు వెళ్ళిపోయి.. అక్కడ నాలుగు రాళ్లు సంపాదించుకోవాల్సిన చోట.. ఇలా కులాల పేరుతో విడిపోవడం నిజంగా బాధాకరం.
అమెరికాలో ఉద్యోగాల పేరుతో.. ఉపాధి పేరుతో స్థిరపడే తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ. అయితే ఈ తెలుగు వాళ్ళు తమ ప్రాంతీయ ప్రేమను.. తమ తెలుగుతనాన్ని గొప్పగా ప్రదర్శించాల్సిన చోట.. కులాల పేరుతో విడిపోతున్నారు. అమెరికాలోని ఒక ఏరియాలో కొత్తగా ఒక జంట దిగింది. వారి గతంలో అపార్ట్మెంట్లో ఉండేవారు. ఇప్పుడు ఒక కమ్యూనిటీలోకి వచ్చేసారు. ఆ కుటుంబంలోని ఒక మహిళను.. మరో మహిళ పలకరించింది. ఇద్దరి మధ్య చాలా సేపు సంభాషణ జరిగింది. చివరికి కొత్తగా చేరిన మహిళలను ఉద్దేశించి.. మరో మహిళ మీ కులం ఏంటని అడిగింది. దీంతో కొత్తగా చేరిన మహిళలో ఆగ్రహం పెరిగిపోయింది. వెంటనే అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయింది. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ఆ మహిళ వీడియో షూట్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది. అంతేకాదు అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్లలో పెరిగిపోయిన కుల పిచ్చికి పరాకాష్టగా నిలుస్తోంది. ఆ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని ఎంతో వేదనతో చెప్పడం విశేషం. ఈ వీడియో పై రకరకాల కామెంట్లు.. రకరకాల చర్చలు జరుగుతున్నాయి. చివరికి ఖండాలు దాటి వేరే దేశానికి వెళ్లిపోయినప్పటికీ కూడా మన తెలుగు వాళ్ళల్లో కుల పిచ్చి పోలేదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.