TANA: అమెరికాలోని ఛార్లెట్ నగరం క్రీడా సందడితో ఉత్సాహభరితంగా మారింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అప్పలాచియాన్ విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 22న పురుషుల వాలీబాల్ టోర్నమెంట్తో పాటు మహిళల ఇంటర్నేషనల్ త్రోబాల్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ రెండు క్రీడా పోటీలకు క్రీడాకారులు, అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ టోర్నమెంట్లలో మొత్తం 325 మంది క్రీడాకారులు పాల్గొనగా, 25 మంది రిఫరీలు పోటీలను నిర్వహించారు. ముఖ్యంగా మహిళల ఇంటర్నేషనల్ త్రోబాల్ టోర్నమెంట్లో పాల్గొన్న జట్లు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ఆకట్టుకున్నాయి. మహిళా క్రీడాకారుల ఉత్సాహం, పోటీతత్వం, క్రీడాస్ఫూర్తి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అదే విధంగా NAFT-TANA నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్కు కూడా మంచి ఆదరణ లభించింది. తానా, NAFT కలిసి ఈ టోర్నమెంట్ను నిర్వహించడం ఇది మూడోసారి కావడం విశేషం. ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై తమ జట్లను ప్రోత్సహించారు.

ఈ రెండు టోర్నమెంట్ల విజయవంతమైన నిర్వహణ కోసం సుమారు 50 మంది వలంటీర్లు తమ సేవలను అందించారు. పోటీలకు హాజరైన తానా జాతీయ నాయకులు నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమం కోసం ఎన్నో గంటలు ప్రణాళిక, సమన్వయం, కష్టపడి పనిచేసిన నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, కిరణ్ కొత్తపల్లి, మాధురి ఏలూరి, రవి (నాని) వడ్లమూడిలను పలువురు ప్రశంసించారు.

తానా నేషనల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీ శివ చావా కార్యక్రమానికి హాజరై క్రీడాకారులను, నిర్వాహకులను అభినందించారు. ఆయన రాకతో క్రీడా వేడుకకు మరింత గౌరవం చేకూరిందని నిర్వాహకులు పేర్కొన్నారు.
క్రీడల ద్వారా తెలుగు సమాజాన్ని మరింత దగ్గర చేసే లక్ష్యంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్లకు లభించిన స్పందన పట్ల తానా అప్పలాచియాన్ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన స్పాన్సర్లు, వలంటీర్లు, క్రీడాకారులు, రిఫరీలు, అభిమానులకు తానా అప్పలాచియాన్ టీమ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. భవిష్యత్తులోనూ మరిన్ని క్రీడా కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు.