MRP Complaint Railway Station :మన దేశంలో రైల్ జర్నీ చేసేవారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. తక్కువ ధరతో ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి ఈ మార్గమే అనుగుణంగా ఉంటుంది. అయితే ఎక్కువ దూరం రైల్ ప్రయాణం చేసేవారు కొన్ని స్టేషన్లలో తినుబండారాలు కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా వాటర్ బాటిల్స్ ను కొనుగోలు చేసేవారు ఎక్కువే. అయితే రైల్వే స్టేషన్లలో ఉన్న స్టోర్స్ లో కొందరు వాటర్ బాటిల్ పై ఉన్న ఎంఆర్పి ధర కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తుంటారు. దీనిపై అడిగితే స్టేషన్లలో అదనంగా ధర ఉంటుందని చెబుతుంటారు. కానీ ఇలా చేసే వారిపై ఫిర్యాదు చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
సాధారణ ప్రదేశాల్లోనైనా.. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో నైనా ప్రతి వస్తువును ఎమ్మార్పీ ధరకు మాత్రమే విక్రయించాలన్న రూల్ ఉంది. అయితే కొందరు అదనంగా డబ్బులు వసూలు చేయడానికి ప్రత్యేక చార్జీలు విధిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని స్టేషన్లలోని విక్రయ దారులు నాణ్యతలేని వస్తువులను కూడా అధిక ధరలతో అమ్ముతున్నారు. అయితే ఇలాంటి వారి గురించి ఫిర్యాదు చేయడానికి రైల్వే స్టేషన్ ప్రత్యేకంగా ఒక నంబర్ ను కేటాయించింది. నీ నెంబర్ ద్వారా సమస్యను చెప్పుకునే అవకాశం ఉంటుంది.
రైల్వే స్టేషన్ లో ఈ సమస్య ఎదుర్కొన్నవారు 139 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇండియన్ రైల్వే తో పాటు ఐఆర్సిటిసి వారు ప్రత్యేకంగా దీనిని కేటాయించారు. ఈ నెంబర్కు కాల్ చేసి రైల్వే స్టేషన్లలో ఉండే స్టోర్స్ ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా అధిక ధరతో వస్తువులను విక్రయిస్తే కూడా చెప్పవచ్చు. ఇలా ఫిర్యాదు చేసిన తర్వాత రైల్వే అధికారులు సంబంధిత విక్రయ షాప్ కు వచ్చి తనిఖీలు చేస్తారు. ఫిర్యాదు నిజమే అయితే ఆ షాప్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అవసరమనుకుంటే ఆ స్టోర్ ను మూసివేయచ్చు కూడా.
అయితే ప్రయాణికులు ఈ ఫిర్యాదు చేసేముందు సరైన ఆధారాలను ఉంచుకోవాలి. విక్రయ దారులు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడా? లేదా? తెలుసుకోవడానికి సంబంధిత బిల్లును ఇవ్వమని అడగాలి. అంతేకాకుండా ప్రయాణికులు తమ టికెట్ నెంబర్ ను అందుబాటులో ఉంచుకోవాలి. అప్పుడే ఫిర్యాదు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ కాల్ ద్వారా మాత్రమే కాకుండా Railmadad అనే వెబ్సైట్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.