Iran US war : ఇరాన్పై చేస్తున్న యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకడుగు వేశారు. ఐదు రోజులపాటు ఇరాన్ విద్యుత్ సంస్థలపై దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 23 రోజుల తర్వాత కూడా ఇరాన్ ప్రతిదాడి చేసే శక్తి కలిగి ఉండడం కూడా ఓ కారణం. తాజాగా అమెరికాకు చెందిన ఎఫ్–35తోపాటు మూడు యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చింది. డిగో గోర్షియాపైనా దాడిచేసే సామర్థ్యం ఉందని చూపింది. దీంతో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే పరిస్థితి ఉండడంతో ట్రంప్ భయపడ్డాడు.. కాదు కాదు ఇరాన్ భయపెట్టింది.
ట్రంప్ విరామ ప్రకటన ఇలా..
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ శక్తి మౌలిక సదుపాయాలపై ఐదు రోజులు దాడులు ఆపుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. గత 48 గంటల అల్టిమేటం ఇచ్చినప్పటికీ, రెండు రోజుల చర్చల్లో ‘నిర్మాణాత్మక పురోగతి‘ కనిపించడంతో ఈ అడుగు వేశారు. హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరవాలని డిమాండ్ చేస్తూ, దీన్ని చివరి అవకాశంగా హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఈ విరామాన్ని అమెరికాకు మాత్రమే పరిమితం చేసుకుంది.
బలంగా ఇరాన్ ప్రతిఘటనా సామర్థ్యం
గత 23 రోజుల్లో ఇరాన్ ఎఫ్–35తోపాటు మూడు అమెరికన్ యుద్ధవిమానాలను దెబ్బతీసి, 4 వేల కిలోమీటర్ల దూరంలోని ఇజ్రాయెల్ అణు కేంద్రాలను మిస్సైల్స్తో తాకింది. ఈ దాడుల్లో వంద మంది మరణించారని ఇరాన్ మీడియా ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థల పరాజయం, గల్ఫ్ దేశాలపై ప్రతీకార హెచ్చరికలు అమెరికా వ్యూహాన్ని సవాలు చేశాయి. ఇరాన్ తమ షరతులకు అంగీకరిస్తేనే యుద్ధం ఆపుతామని స్పష్టం చేసింది.
రేజీమ్ చేంజ్ కష్టమే..
ట్రంప్ ఆశించిన పాలకుల పతనం జరగకపోవడం, ఇరాన్ ప్రజలు రోడ్లపైకి రాకపోవడం పెద్ద ఇబ్బందిగా మారింది. వెనెజువెలా వంటి పరిస్థితి ఏర్పడకపోవడంతో యుద్ధం సుదీర్ఘంగా మారే పరిస్థితి కనిపించింది. అమెరికా అధికారులు అంతర్జాతీయ చట్టాల భయంతో దాడులు ఆపమని సలహా ఇచ్చినట్లు సూచనలు ఉన్నాయి.
చమురు, గ్యాస్ ధరలు రెక్కలు పుట్టడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంగుతోంది. గల్ఫ్ దేశాలు ఇరాన్ దాడులతో అల్లాడుతున్నాయి, లక్షలాది భారతీయుల భద్రత ఆందోళన కలిగించింది. అమెరికాలో ఎక్కువ మంది ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు, కాంగ్రెస్ అనుమతి లేకుండా దాడులు చట్టవిరుద్ధమని ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కారణాలతో ట్రంప్ మార్కెట్లు తెరుచుకునే సమయానికి విరామం ప్రకటించారు.
