Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్తో ఇరాన్ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు ఇచ్చినందుకు ఇరాన్ గల్ఫ్ దేశాలపై ప్రత్యక్ష దాడులు చేస్తోంది. ఈ దాడులు ఆ దేశాల అంతర్జాతీయ ప్రతిష్టపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ఇరాన్ లక్ష్యాలపై వైమానిక చర్య
అమెరికా మీడియా నివేదికల ప్రకారం, జూలై ప్రారంభంలో బహ్రెయిన్, కువైట్ వైమానిక దళాలు ఇరాన్లోని డ్రోన్, క్షిపణి నిల్వలపై దాడులు చేశాయి. ఇది ఆ రెండు దేశాలు ఇరాన్పై నేరుగా సైనిక చర్యకు పాల్పడిన తొలి సందర్భం. యూఏఈ గూఢచర్య సమాచారం అందించి సహకరించింది. సౌదీ అరేబియా ప్రారంభంలో యూఏఈతో కలిసి ముందుకు వచ్చినా, తర్వాత తన వైఖరిని మార్చుకుంది. ఈ రెండు దేశాల వైమానిక దళాలు పరిమాణంలో చిన్నవి. అవి ఉపయోగించే యుద్ధ విమానాలు ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాల నుంచి వచ్చినవే. సైనిక అవసరాల్లో అమెరికాపై ఎక్కువగా ఆధారపడే ఈ దేశాలు, తమపై పదేపదే జరుగుతున్న దాడులకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొనసాగుతున్న దాడులు..
రెండు వారాల క్రితం హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ చర్యలు చేపట్టడంతో ప్రాంతం మళ్లీ అస్థిరమైంది. యూఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బహ్రెయిన్, కువైట్తో పాటు జోర్డాన్పై కూడా ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేస్తున్నామని చెప్తున్నా, ఆ దేశాల పేరు అంతర్జాతీయంగా దెబ్బతింటోంది.
సౌదీ, హూతీ ఘర్షణలు..
అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలతోపాటు సౌదీ అరేబియా, యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారుల మధ్య కూడా ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న హూతీలు ఎర్రసముద్రంలో దిగ్బంధనం ప్రకటించి సౌదీ నౌకలపై దాడులు చేశాయి. దీనికి ప్రతిగా సౌదీ అరేబియా యెమెన్లోని హూతీ నియంత్రిత ప్రాంతాలపై వైమానిక దాడులు చేపట్టింది.
అమెరికా – ఇరాన్ యుద్ధం ప్రారంభమై ఆరు నెలలైంది. ఇంతకాలం ఓపిక వహించిన గల్ప్ దేశాలు తమ భద్రత కోసం అమెరికాపై ఆధారపడుతూనే, ఇరాన్ నుంచి వస్తున్న ప్రత్యక్ష ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. చిన్న సైనిక శక్తులు కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా పాల్గొనడం ప్రాంతీయ యుద్ధం విస్తరణకు మరో దశగా కనిపిస్తోంది. ఇక ముందు పరిస్థితులు ఎలా మారతాయో అని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.


