Homeఆంధ్రప్రదేశ్‌సోనియా సమావేశానికి చంద్రబాబు ఎందుకు హాజరు కాలేదు?

సోనియా సమావేశానికి చంద్రబాబు ఎందుకు హాజరు కాలేదు?


టీడీపీ అధినేత చంద్రబాబుకు తత్వం బోధపడింది. అందుకే సార్వత్రిక ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ ను నెత్తిన పెట్టుకొని మోడీని తిట్టిపోసిన ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. తన అనుంగ మీడియా అధిపతులు.. ఇతర నేతల మాటలు విని మోడీని దూరం పెట్టినందుకు ఇప్పుడు బాబు కుమిలిపోతున్నాడు. అందుకే కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినా వెళ్లకుండా చంద్రబాబు దూరంగా జరగడం.. బీజేపీతో చెలిమిని మళ్లీ కంటిన్యూ చేయడానికేనని తెలుస్తోంది.

*సోనియా మీటింగ్ కు బాబు గైర్హాజరు
దేశంలోని 22 జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారతదేశ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి మోడీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దేశంలోని ప్రతిపక్షాలు, అఖిలపక్షం నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు హాజరు అవుతారని అందరూ ఊహించారు. కానీ బాబు హాజరు కాలేదు. బీజేపీతోనే ఉంటానని.. కాంగ్రెస్ దోస్తీ వద్దంటూ సోనియా సమావేశానికి గైర్హాజరవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

*బాబు ఎందుకు దూరంగా జరిగారు?
గడిచిన ఏడాది మే 19న సార్వత్రిక ఎన్నికల చివరి రోజున, చంద్రబాబు ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి రాహుల్ ను ప్రధానిని చేద్దాం అని ప్రతిపాదించారు. ఫలితాల అనంతర సందర్భంలో అన్ని ప్రతిపక్ష పార్టీల సమావేశం నిర్వహించాలని ఆమెతో చర్చించారు. కానీ అది జరగలేదు. ఎందుకంటే మోడీకి క్లియర్ కట్ మెజార్టీ వచ్చి తిరిగి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అవమానకరమైన ఓటమిని ఎదుర్కొన్నాయి. దీంతో బాబు ఆశలు నెరవేరలేవు. ఆయన కూడా దారుణంగా ఏపీలో ఓడిపోవడంతో కాంగ్రెస్ తో దోస్తీ అప్పుడే చెడింది. కాంగ్రెస్ ను నమ్మితే కష్టం అని ఆ పార్టీకి దూరంగా జరిగారు.

*బలమైన మోడీకి ఎదురు నిలవవద్దనే..
మోడీ వ్యతిరేక బృందంలో భాగం కావడం ఇష్టం లేని చంద్రబాబు తాజాగా సోనియా గాంధీ నిర్వహించిన మీటింగ్ కు దూరంగా జరిగారు. ఎన్టీఏ తలుపులు తెరిస్తే అందులో దూకడానికి చంద్రబాబు రెడీ అయ్యారు. కాంగ్రెస్ కోలుకోవడం కష్టమని.. మోడీ స్టామినా ఇప్పట్లో తగ్గేలా లేదని బాబు గ్రహించారు. అందుకే రెండోసారి బీజేపీ గెలవగానే.. చంద్రబాబు ఇప్పటికే తన నలుగురు ఎంపీలను బీజేపీలోకి సాగనంపారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు కూడా తొందరగా సర్దుకుంటున్నాడు. కాంగ్రెస్ కాడిని వదిలేశాడు. ఏపీలోనూ ఓడిపోవడంతో ఇక సోనియా.. రాహుల్ ను కలవడానికి లేదా పలకరించే సాహసం కూడా చేయలేదు. ఇలా చంద్రబాబు ప్రస్తుతం కాంగ్రెస్ కు దూరంగా.. బీజేపీకి దగ్గరగా అడుగులు వేస్తున్నారు. అయితే బాబు ఎంత ప్రయత్నిస్తున్నా బీజేపీ మాత్రం బాబును పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు.

-నరేశ్ ఎన్నం

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version