BL Santosh- SIT: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సంచలనం కలిగిస్తోంది. ఈ కేసుకు సబంధించి సిట్ కీలక ఆధారాలు సేకరించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పాత్ర ఉన్నట్లు కచ్చితమైన ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే నిందితుడుగా ఉన్న రామచంద్ర భారతి – బీఎల్ సంతోష్ మధ్య జరిగిన ఫోన్, వాట్సప్ సంభాషణలను సిట్ సేకరించింది. వీటిని అధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి..ఏం జరిగిందనే దాని పైన ఫొటోలను కోర్టుకు సమర్పించింది. దీంతో, ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో కీలక పరిణమాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

అంతా సంతోష్ కనుసన్నల్లోనే..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో మోయినాబాద్ ఫామ్ హౌస్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు చెబుతున్న నందకుమార్, సింహయాజీ, రామచంద్రభారతి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఈ ముగ్గురు నిందితుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. బీఎల్ సంతోష్కు తెలిసే ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియ జరిగిందన్న అభిప్రాయానికి సిట్ అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆయన ప్రమేయాన్ని రుజువు చేసే పక్కా ఆధారాలను సిట్ ఇప్పటికే సిద్దం చేసుకుందని సమాచారం. సిట్ విచారణ ఎదుర్కొంటున్న నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతి – బీఎల్ సంతోష్ మధ్య పలు సందర్భాల్లో చోటు చేసుకున్న ఫోన్ – వాట్సప్ సంభాషణలను సిట్ సేకరించింది. సంతోష్తో రామచంద్ర భారతి హరిద్వార్లో భేటీ అయిన ఫొటోలను సంపాదించింది. అక్టోబరు 15న బీఎల్ సంతోష్ అధికారిక నివాసంలో ఉదయం 10 గంటలకు జరిగిన సమావేశంలో తుషార్ వళ్లెపల్లి, రామంద్ర భారతి, నందు, విజయ్ పాల్గొన్నట్లుగా ఆధారాలు సేకకరించినట్లు తెలుస్తోంది.
సాంకేతిక ఆధారాలతో సిట్..
నిందితుల విచారణ సమయంలో సేకరించిన సమాచారం.. సాంకేతికంగా సంపాదించిన ఆధారాలతో సిట్ బీఎల్ సంతోష్ను బుక్చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు సెల్ఫోన్ లొకేషన్లను సేకరించిన సిట్ సాంకేతికంగా బలమైన ఆధారం సేకరించిందని సమాచారం. ఆ సమయంలో తీసిన వీడియో, ఫొటోలను కూడా సిట్ స్వాధీనం చేసుకుందని తెలిసింది. సెప్టెంబరు 26న హైదరాబాద్లోని నందు నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. అంతకు ముందు రామచంద్ర భారతి, సింహయాజి, న్యాయవాది పి.ప్రతాప్ ఆగస్టు 21న ఢిల్లీలోని వరల్డ్ బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు కేసీ.పాండే నివాసంలో సమావేశమైన విషయాన్ని న్యాయవాది ప్రతాప్ విచారణలో నిర్ధారించడంతోపాటు కీలక విషయాలు వెల్లడించారు. సెప్టెంబరు 4న మరోసారి రామచంద్ర భారతి, నందు, సింహయాజి, న్యాయవాది శ్రీనివాస్ సమావేశమయ్యారు. సిట్ సేకరించిన వాట్సప్ చాటింగ్ ఆధారాల్లో పలువురి పేర్లను కూడా సిట్ గుర్తించింది. ఈ కేసులో వారి ప్రమేయం ఎంత వరకు ఉందనే కోణంలో ఆరా తీస్తోంది.

కాంగ్రెస్ నేతలతో సింహయాజి మంతనాలు..
సిట్ విచారణ చేస్తున్న ముగ్గురు నిందితుల్లో ఒకరుగా ఉన్న సింహయాజీ హైదరాబాద్ కేంద్రంగా పలువురితో భేటీలు నిర్వహించారు. హైదరాబాద్లోని స్కై హై హోటల్లో ప్రొఫెసర్ కోదండరామ్, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రాజనర్సింహతోపాటు మరికొందరితో కూడా సమావేశమైనట్లు గుర్తించారు. ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న వారితో పాటుగా నిందితులుగా చేర్చిన వారు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం పైన ఎక్కడ ఎప్పుడు సమావేశమయ్యారనే ఆధారాలను సిట్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. బీఎల్ సంతోష్ ప్రస్తుతం హైకోర్టు మినహాయింపుతో విచారణకు హాజరు కాలేదు. సిట్ పక్కా ఆధారాలను కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో వచ్చే వారం ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయం.