ముఖ్యమంత్రి జగన్ ను విపక్షాలకన్నా ఎక్కువే ఇబ్బంది పెట్టారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు. విపక్ష సభ్యుడు అయిఉంటే లైట్ తీసుకునేవారేమోగానీ.. సొంత పార్టీ సభ్యుడిగా ఉండి, అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తుండడంతో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంది. ఇంకా ముగియని ఈ ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో? ఎక్కడిదాకా వెళ్తుందో? తెలియదు. అయితే.. ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో జగన్ చాలా అసహనంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నరసాపురం నియోజకవర్గానికే ఆయన చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
పార్టీ ఏదైనా.. అభ్యర్థి ఎవరైనా.. నరసాపురం నియోజకవర్గంలో క్షత్రియవర్గానిదే హవా అన్నట్టుగా ఉంది పరిస్థితి. అన్ని పార్టీలు ఇక్కడ రాజులకే టికెట్ కేటాయించడం కామన్ అయిపోయింది. ఆ విధంగా ఇప్పటి వరకు మెజారిటీగా ఆ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఎన్నికయ్యారు. అయితే.. ఇప్పుడు ఆ సంప్రదాయానికి చెక్ పెట్టే దిశగా ఆలోచిస్తున్నారట జగన్. వచ్చే ఎన్నికల్లోనే ఈ వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నారట.
రఘురామ వ్యవహారంతో ఆ ప్రాంతంలో పార్టీకి కాస్త డ్యామేజ్ జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రఘురామపై మరో క్షత్రియ మంత్రి రంగరాజును ఉసిగొల్పడం వంటి చర్యలతో.. రాజకీయంగా బలమైన వర్గంగా ఉన్న క్షత్రియుల్లో వైసీపీపై వ్యతిరేకత పెరిగిందంటున్నారు విశ్లేషకులు. మరోవైపు ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు టీడీపీ, ఇతర విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇవన్నీ కలిపి వచ్చే ఎన్నికల్లో పుట్టి ముంచే అవకాశం ఉందని భావిస్తున్న జగన్.. నరసాపురంలో రాజులకు కాకుండా ఇతరులకు టికెట్ ఇవ్వాలని చూస్తున్నారట.
గతంలో వైఎస్ కూడా ఈ తరహా ప్రయోగం చేశారు. సక్సెస్ కూడా అయ్యారు. కాపునేత చేగిండి హరిరామ జోగయ్యను బరిలోకి దించి.. అప్పటి కేంద్ర మంత్రి కృష్ణం రాజును ఓడించారు. 2014లోనూ ఇదే ప్లాన్ చేసినప్పటికీ వర్కవుట్ కాలేదు. కాపు వర్గానికి చెందిన రవీంద్రనాథ్ కు టికెట్ ఇస్తే ఓడిపోయారు. గత ఎన్నికల్లో క్షత్రియుల ఒత్తిడి మేరకు రఘురామకు టికెట్ ఇచ్చారు జగన్. తీరా గెలిచిన తర్వాత ఆయన సొంత పార్టీ మీదనే యుద్ధానికి సిద్ధమయ్యారు.
ఇలాంటి పరిస్థితుల్లో పాత వ్యూహాన్ని కొత్తగా అమలు చేయడానికి సిద్ధమయ్యారట జగన్. నరసాపురంలో వచ్చే ఎన్నికల్లో క్షత్రియులకు చెక్ పెట్టి, శెట్టిబలిజ వర్గానికి టికెట్ ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నారట. మరి, ఇందులో వాస్తవం ఎంత అన్నది చూడాల్సి ఉంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండడంతో.. పరిస్థితులు ఏ విధంగా మారుతాయో చూడాలి.