Panchumarthi Anuradha : అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే మేయర్ గా విజయం సాధించారు. 26 ఏళ్ల వయసులో విజయవాడ మేయర్ పీఠంపై కూర్చున్న ఆమె.. ఇప్పుడు కలిసి వచ్చిన అదృష్టంతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమే పంచుమర్తి అనురాధ. ఆమె రాజకీయ నేపథ్యం ఒకసారి చూసేద్దాం.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పంచుమర్తి అనురాధ రాజకీయ రంగ ప్రవేశం ఎలా చేశారు..? అతి చిన్న వయసులోనే మేయర్ గా ఎలా ఎన్నికయ్యారు..? అన్న ఆసక్తి సర్వత్వ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ వివరాలను తెలుసుకుందాం.
వైసిపి కి సాకిస్తూ ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఈ విజయం రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన పంచుమర్తి అనురాధ రాజకీయ ప్రయాణము ఒక సంచలనమే. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి అతిపిన్నవయసులోనే విజయవాడ మేయర్ గా తనదైన ముద్రవేశారు.
రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి..
పంచుమర్తి అనురాధ కుటుంబానికి రాజకీయాలకు అసలు సంబంధమే లేదు. తండ్రి స్వర్గం పుల్లారావు ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు. ఆదాయపు పన్ను శాఖలో జాయింట్ కమిషనర్ గా పనిచేసి, పదవీ విరమణ చేశారు. తల్లి గృహిణి. అనురాధకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో బదిలీలు జరుగుతుండేవి. అలా ప్రాథమిక విద్య హైదరాబాదు సెయింట్ ఆన్స్ లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయనకు బదిలీ కావడంతో అనురాధ హై స్కూల్, ఇంటర్ విద్యను విజయవాడలో పూర్తి చేశారు. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ను గుంటూరు జే కే సి కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే పారిశ్రామికవేత్త శ్రీధర్ తో ఆమెకు వివాహం జరిగింది. వీరికి ఒక పాప. ఆ తరువాత పంచుమర్తి అనురాధ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అటు పుట్టింటి వారు, ఇటు అత్తింటి వారు ఎవరికి రాజకీయాలతో సంబంధం లేదు.
అతి పిన్న వయసులో మేయర్ గా ఎన్నిక..
పంచుమర్తి అనురాధ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. 2000 సంవత్సరంలో విజయవాడ మేయర్ పదవిని మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో ఒకరోజు పేపర్ చదువుతుండగా ఆ వార్త అనురాధను ఆకర్షించింది. దీంతో తన చదువు, కుటుంబ వివరాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపారు. అప్పట్లో కార్పొరేటర్, మేయర్లకు విడివిడిగా ఎన్నికలు జరిగేవి. దీంతో తెలుగుదేశం పార్టీ నుంచి మేయర్ గా పోటీ చేసేందుకు ఏకంగా 18 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాజకీయాలకు కేంద్ర బిందువు విజయవాడ. అక్కడ జరిగే చిన్న రాజకీయ చర్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పై ఖచ్చితంగా ప్రభావం చూపేదే. పైగా అటు కమ్యూనిస్టులకు, ఇటు కాంగ్రెస్ కు కూడా బలమైన కేడర్ ఉంది. దీంతో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. టెక్నాలజీ అంటే స్వతహాగా ఆసక్తి ఉన్న చంద్రబాబుకు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసిన పంచుమర్తి అనురాధ ఇచ్చిన సమాధానాలు, పంచుకున్న అభిప్రాయాలు నచ్చాయి. అంతేకాకుండా విద్యారంగం పైన అడిగిన ప్రశ్నలకు అనురాధ చక్కని సమాధానాలు ఇవ్వడం, ఉన్నత విద్యావంతురాలు కావడంతో చంద్రబాబు ఆమె వైపే మొగ్గు చూపించారు. నేరుగా జరిగిన మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నాగరాణి, కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థి తాడి శకుంతల నుంచి గట్టి పోటీ ఎదురైనా దాదాపు 6800 పై చిలుకు ఓట్లతో అనురాధ విజయం సాధించారు. అలా, 26 ఏళ్ల వయసులోనే మేయర్ గా పగ్గాలు చేపట్టారు.
విజయవంతమైన మేయరుగా గుర్తింపు..
అనురాధ మేయర్ గా ఎన్నికైనా రాజకీయ అనుభవం లేకపోవడంతో తొలినాళ్ళలో ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ కార్పొరేటర్ల నుంచి తరచూ ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యేవి. మొదటి ఐదు నెలలు ఏం చేయాలో ఆమెకు తెలియలేదు. దీంతో మేయర్ బాధ్యతలు, విధులు గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని సంకల్పించారు. ట్యూషన్ పెట్టించుకుని మరి మున్సిపల్ యాక్ట్, నగరానికి, పౌరులకి ఏం చేయాలి..? నగరాల అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏమిటి..? ఎలా ప్రతి విషయాన్ని తెలుసుకొని ముందుకు సాగారు. ఆ సమయంలో కృష్ణ పుష్కరాలు జరగడంతో రాజకీయంగా అనేక విషయాలను నేర్చుకునేందుకు ఆమెకు ఎంతగానో దోహద పడింది.
పార్టీ కోసం ఎంతో చేశారు..
మేయర్ పదవి పూర్తయిన తర్వాత అనురాధ కొన్నాళ్లపాటు రాజకీయాలకు కాస్త దూరంగా ఉండిపోయారు. అసలు ఆ తర్వాత రాజకీయాల్లో కొనసాగాలని ఆమె కోరుకోలేదు. అయితే 2007 నుంచి మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్న, అనుకోని కారణాల వల్ల రాలేకపోయారు. 2009లో మంగళగిరి నుంచి పోటీ చేయాలనుకున్నారు, కానీ ఆ సీటు బాజాపాకు వెళ్లిపోవడంతో కుదరలేదు. చేరాలనించి పోటీ చేసే అవకాశం ఉన్న దూరం కావడంతో అందుకు ఆసక్తి చూపించలేదు. ప్రత్యక్ష రాజకీయాల కన్నా పార్టీకి సేవ చేయాలని సంకల్పించారు. చంద్రబాబు నాయుడు కూడా ఆమెకు పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పించారు. అలా పార్టీలో వివిధ పదవులు చేపట్టారు. ఉత్తరాంధ్ర జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఆ తరువాత అధికార ప్రతినిధిగాను వ్యవహరించారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి అవకాశం దక్కించుకోవడమే కాకుండా విజయం సాధించారు.
Web Title: Life and political journey of panchumarthi anuradha
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com