వైఎస్ జగన్మోహన్రెడ్డిని కాంగ్రెస్, టీడీపీలు ఏ స్థాయిలో ఇబ్బందుల పాల్చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ అయిన జగన్ను ఏడాదికి పైగా జైలులో పెట్టారు. కాంగ్రెస్, టీడీపీలు ఆడుతున్న ఈ జగ‘న్నాటకానికి’ ‘ఎల్లో’ మీడియా తోడైంది. అప్పటి పరిస్థితుల్లో జగన్పై ఏ స్థాయిలో స్టోరీలు అల్లాయో అందరికీ తెలిసిందే. వైఎస్సార్ మరణానంతరం నుంచే జగన్పై కక్ష కట్టినట్లు వార్తలు వడ్డిస్తోంది ఎల్లో మీడియా. చివరికి జగన్ సీఎం అయినా కూడా నిత్యం ‘పుండు కారం చల్లినట్లుగా’ ఏదో ఒక కథ(నా)లు చెబుతూనే ఉన్నాయి. తాజాగా.. మరోసారి తన అక్కసును వెల్లగక్కింది. కడుపులో ఉన్న కసినంతా కుమ్మరించాయి.
Also Read: జగన్ పాలన జనాలకు నచ్చడం లేదా..?
ప్రభుత్వ మాజీ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ ఉదంతంపై ‘ఎల్లో’ మీడియా తాజాగా పుంఖాను పుంఖాలుగా వార్తలు వడ్డించాయి. జగన్ పనిగట్టుకుని దమ్మాలపాటిని వేధిస్తున్నారని రాస్తూనే పాతచింతకాయల పచ్చడిని మరోసారి ముందు పెట్టింది. జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసింది. జగన్పై నమోదైన కేసులు వాదించి.. వాటిని సీబీఐకి అప్పగించాలని దమ్మాలపాటి కోరారని.. అందుకే ఆయనపై కసి తీర్చుకుంటున్నారని భారీ ఎత్తున విమర్శలకు దిగింది.
అదే సమయంలో మోకాలికి.. బోడిగుండుకు ముడి వేస్తూ.. జగన్ కేసులను అప్పట్లో ఎర్రన్నాయుడు, అశోక గజపతిరాజు కోర్టుల్లో ఇంప్లీడ్ అయ్యారని, అందుకే వారిని కూడా వేధిస్తున్నారని కథనాల్లో ఆరోపించాయి. అందుకే అశోక్ను మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి పీకేశారని.. అచ్చెన్నాయుడిని జైలుకు పంపారని పేర్కొంది. ఇదంతా జగన్ వారిపై పెంచుకున్న కక్ష నేపథ్యంలోనే సాగుతున్న వ్యవహారమంటూ చూపాయి.
ఓకే.. వీరంతా జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనను ఏదో రకంగా ఇబ్బంది పెట్టిన వారే. ఇప్పుడు జగన్ సీఎం. వీరిపై కక్ష తీర్చుకోవాలనుకుంటే ఎంతసేపు. జగన్పై నమోదైన కేసుల విషయంలో వ్యక్తిగత కక్షలకు అవకాశం ఇస్తే.. ఆయా వ్యక్తుల జాబితా తయారు చేస్తే.. వారిపై కేసులు నమోదు చేయడానికైనా.. వారందరినీ జైళ్లోకి పంపించేందుకైనా ఈ ఐదేళ్లు సరిపోతాయా అనేది రాజకీయ విశ్లేషకుల మాట. అవును మరి.. కక్ష సాధింపు చర్యలకు దిగితే జగన్ ఈ ఐదేళ్ల టర్మ్ వాటికే సరిపోతుంది. మరి ఈ స్థాయిలో బరితెగించి ‘ఎల్లో’ మీడియా కథనాలు ఎందుకు రాస్తున్నట్లు.
Also Read: 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేనదే హవా…. ఆ రెండు పార్టీలకు షాక్?
ఒకవేళ జగన్ ముందుగా కక్ష తీర్చుకోవాలి అనుకుంటే.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను అరెస్టు చేయాలి. ఎందుకంటే ఆయనే కదా.. జగన్ను 16 నెలలు జైలుకు పంపింది. మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డిని కూడా అరెస్టు చేయించాలి. ఎందుకంటే అసెంబ్లీలో కేసుల విషయాన్ని ప్రస్తావించి జగన్ను చులకనగా మాట్టాడిందే ఈయనే కదా. అదేవిధంగా చంద్రబాబు అరెస్టు కావాలి. ఇలా ఈ జాబితాలో ఉన్నవారితోపాటు.. తనకు జైలు శిక్ష విధించిన న్యాయమూర్తులను కూడా విడిచి పెట్టొద్దు.
ఇప్పుడప్పుడే వీటన్నింటినీ పట్టించుకోకుండా ప్రజా పాలన మీదే దృష్టి పెట్టాడు సీఎం జగన్. దీన్ని పట్టించుకోకుండా.. జగన్ అభివృద్ధిని చూపకుండా ‘ఎల్లో’ మీడియా కుట్రలు, కుతంత్రాలు అంటూ కథనాలతో రగిలిపోతోంది. గతంలోనూ.. ఇప్పుడూ ఇష్టం వచ్చినట్లు శీర్షికలతో కథనాలు రాస్తున్న ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఆర్కేలకు కూడా జగన్ శిక్షలు వేయాల్సిందే మరి. లేదా అరెస్టులైనా చేయాలి. కానీ ఇవన్నీ జరగలేదు కదా?! మరి దీనిని ఎలా చూడాలి. ‘తాము చేస్తే సంసారం.. పక్కింటోడు చేస్తే వ్యభిచారం’ అన్నట్లు వ్యవహరిస్తే ఈ ‘ఎల్లో’ మీడియాను ఏమనాలి మరి.