నిజాముద్దీన్ లోని తబ్లిఘీ మర్కజ్లో జరిగిన సదస్సుతో అదుపులోకి వస్తున్నది అనుకున్న కరోనా వైరస్ మహమ్మారి తిరిగి పడగలెట్టడంతో కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థ ఆర్ధిక మూలాలపై కన్నేసింది. అందుకై కేంద్ర దర్యాప్తు సంస్థ బృందాలు రంగంలోకి దిగినట్లు తెలిసింది.
ఈ సంస్థకు వెల్లువలా నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయన్న దానిపై ఈ సంస్థలు ఇప్పటికే లోతైన దర్యాప్తును ప్రారంభించాయి. గల్ఫ్ దేశాల నుండే ఎక్కువగా నిధులు సమకూరుతున్నట్లు అధికారులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది.
అంతేకాకుండా తబ్లిఘీ చీఫ్ మౌలానాకు ఇప్పటికే ఢిల్లీ పోలీసులు తాఖీదులు పంపించారు. ఆర్థిక మూలాలపై కూడా ఓ ప్రశ్నల జాబితాను రూపొందించి మౌలానాకు సంధించారు.
ఆ ప్రశ్నావళిలోనే ఆ సంస్థ పూర్తి చిరునామాతో పాటు, కార్యవర్గ సభ్యుల పూర్తి వివరాలను కూడా పోలీసులు పొందుపరిచారు.
వీటితో పాటు గత మూడేళ్లుగా ఆ సంస్థ దాఖలు చేసిన ఆదాయపన్ను వివరాలు, పాన్ కార్డు నెంబర్, బ్యాంకు అకౌంట్లను, బ్యాంకు స్టేట్మెంట్లను కూడా పోలీసులు కోరారు.
జనవరి 1 వరకు ఆ సంస్థ నిర్వహించిన సమావేశాల వివరాలు, ఆ సంస్థ ప్రాంగణం వివరాలు, ఆ ప్రాంగణంలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాట్లపై, ఆ సంస్థ సభ్యులు మాట్లాడిన ఆడియో, వీడియోలతో పాటు మార్చి 12 తర్వాత వివిధ దేశాల నుంచి హాజరైన ప్రతినిధుల వివరాలను తెలపాలని కేంద్ర దర్యాప్తు బృందాలు ప్రశ్నావళిలో కోరినట్లు చెబుతున్నారు.
తబ్లిఘీ తక్లీఫ్ సంస్థ జరిపిన సదస్సు వల్లే దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో ఈ సంస్థ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దీంతో మార్చి 13- 15 మధ్య జరిగిన సమ్మేళనంలో హాజరైన వారి కోసం కేంద్రం దేశమంతటా జల్లెడ పడుతోంది.
ఇప్పటి దాకా దీనికి హాజరైన సభ్యులతో పాటు వారితో కలిసి తిరిగిన, వారు కాంటాక్ట్ చేసిన సుమారు తొమ్మిది వేల పైచిలుకు మందిని క్వారంటైన్లోకి పంపినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరిలో 1306 మంది విదేశీయులే కావడం విశేషం.