దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడో పతనమైపోయింది. అంతరించిపోతున్న జంతు జాతుల మాదిరిగా.. ఎక్కడో ఒకటీ అరా కనిపిస్తున్నాయి. ఉన్నాకూడా.. అందులో ఎంత మంది ఉంటారు? పదీ పదిహేను మంది ఉంటే.. అది చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ కింద లెక్క. కానీ.. ఉత్తర ప్రదేశ్ లో ఓ ఉమ్మడి కుటుంబం ఉంది. అందులో ఎంత మంది ఉంటారో తెలిస్తే.. షాకే!
యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలోని తుండ్లా తహసీల్ పరిధిలో ఉన్న చికావు గ్రామం అది. అందులో నీరజ్ దీక్షిత్ కుటుంబం ఉంది. ఇందులో ఏకంగా 38 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. వినోద్ దీక్షిత్ అనే వ్యక్తి ఆ గ్రామంలో పెద రాయుడి లాంటోడు. ఊరితోపాటు తన ఇంటిని కూడా కలిపే ఉంచారు. అలా.. వీళ్ల ఉమ్మడి కుటుంబం పెరుగుతూ.. విస్తరిస్తూ వస్తోంది.
వీళ్ల ఉమ్మడి కుటుంబానికి తగినట్టుగానే.. వీరి ఇల్లు కూడా భారీగా ఉంటుంది. 2,675 చదరపు అడుగు విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులోనే 38 మంది ఉంటున్నారు. వీరి భోజనం విషయం చూస్తే.. రోజుకు 5 కేజీలో పిండి, 3 కిలోల బియ్యం, 2 కేజీల పప్పులు, 3 కిలోల దోసకాయ-టమాటాలు అయిపోతుంటాయి. వంట మొత్తం ఒకే పొయ్యి మీద వండేస్తుంటారు.
ఈ ఇంట్లో మగాళ్లు బయట ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తుంటారు. ఆడవాళ్లు ఇంటి పనులు చూస్తుంటారు. నీరజ్ దీక్షిత్ వ్యవసాయంతోపాటు ఊళ్లో చిన్న వ్యాపారం చేస్తుంటారు. అతని సోదరులు నలుగురు ఉద్యోగం చేస్తుండేవారు. కరోనా నేపథ్యంలో వారు కూడా ఇంటికి వచ్చేశారు.
యూపీలో కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్న ఈ పరిస్థితుల్లో వీళ్ల ఇంట్లో ఒక్కరికి కూడా రాలేదు. కారణం.. నిబంధనలు పక్కాగా పాటించడమే. బయటి వారికి ఎవరికీ ఇంట్లోకి ప్రవేశం లేదు. ఇంట్లోని వారు అవసరాల కోసం వెళ్తే.. తప్పక మాస్కు ధరించాలి. బయట ఉన్న గదిలో కాసేపు గడిపిన తర్వాతే రావాలి. వారి దుస్తులు వేడి నీళ్లలో ఉతికేస్తారు. అందులో బ్యాక్టీరియాను చంపే ఔషధాలను వాడతారు. ఈ విధంగా.. తన ప్రత్యేకతను చాటుకుంటోంది దీక్షిత్ ఉమ్మడి కుటుంబం. ఈ నెల 15న ఉమ్మడి కుటుంబ దినోత్సవం నేపథ్యంలో వీరి అంశం తెరపైకి వచ్చింది.