తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లో పోటీపడి ప్రచారం నిర్వహించాయి. ఇక బలమైన స్వతంత్రులు, ఇతర దిగ్గజాలు పోటీపడ్డ ఈ ఫలితం రేపు వెలువడనుంది. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణలో ఈనెల 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరిగింది. ఈ ఓట్లను బుధవారం లెక్కిస్తున్నారు. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. గట్టిపోటీనిచ్చేలా స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలవడంతో రసవత్తర పోరు నెలకొంది.
మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గం నుంచి 93మంది బరిలో నిలవగా.. వరంగల్-ఖమ్మం-నల్గొండ నుంచి 71మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లు సైతం ఈసారి భారీగా తరలివచ్చి ఓటింగ్ లో పాల్గొనడం విశేషం.
పోలైన మొత్తం ఓట్లలో 50శాతం+ ఓటు అధికంగా వచ్చేదాక ఓట్ల లెక్కింపు చేపడుతారు. రెండు నియోజకవర్గాల్లో మూడున్నర లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారే విజేతగా నిలుస్తారు. కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం కానుంది.
ఎవరికి 50శాతం కంటే ఒక్క ఓటు అధికంగా రాకపోతే ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్య ఓటును లెక్కిస్తారు. అక్కడా తేలకపోతే మూడో ప్రాధాన్య ఓటును లెక్కిస్తారు. అలా 50శాతానికి మించి ఒక ఓటు ఎక్కువగా వచ్చేదాకా లెక్కింపు చేపట్టి ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. 100 మంది వరకు అభ్యర్థులు బరిలో ఉండడంతో లెక్కింపు ఆలస్యం కానుంది.
విజయంపై ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రులుఎవరి వైపు నిలిచారో తేలాలంటే రేపు కౌంటింగ్ లో తేలనుంది. ప్రధానంగా చూస్తే.. నల్లగొండ–ఖమ్మం–వరంగల్లో గిరిజన నేత రాములునాయక్కు టికెట్ ఇవ్వడం కలసి వస్తుందని, పోలింగ్ సరళి కూడా ఇదే చెబుతోందని గాంధీభవన్ వర్గాలంటున్నా యి. సామాజిక కోణంలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్నగర్లో టీఆర్ఎస్, బీజేపీల నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులుండటం, మరో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నేతకు తాము టికెట్ ఇవ్వడం లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. పాలమూరు జిల్లాలో స్థానికత పనిచేసిందని, రాజకీయంగా తమ అభ్యర్థి చిన్నారెడ్డి అనుభవజ్ఞుడు కావడం లాభించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్పై ఎలాగూ వ్యతిరేకత ఉందన్న ధీమా కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
-నల్లగొండ–ఖమ్మం–వరంగల్లో కోదండరాం గెలుపు ఖాయమా?
పోలింగ్ జరిగిన సరళిని బట్టి నల్లగొండ నుంచి ప్రొఫెసర్ కోదండరాం గెలుస్తారనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇక్కడ ప్రథమ ప్రాధాన్యత ఎవరికి వేసినా, రెండో ప్రాధాన్యత కింద ప్రొఫెసర్ను ఎంచుకున్నారనే చర్చ జరుగుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ఆయనకున్న సంబంధాలు, తెలంగాణ జేఏసీ చైర్మన్గా రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్రను పరిగణనలోనికి తీసుకుని పట్టభద్రుల పోలింగ్ జరిగిందనే వాదన ఆసక్తిని కలిగిస్తోంది.
-హైదరాబాద్–రంగా రెడ్డి–మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ యేనా?
హైదరాబాద్–రంగా రెడ్డి–మహబూబ్నగర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ గెలుపుపై కూడా పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రథమ ప్రాధాన్యత ఎవరికి వేసినా, రెండో ప్రాధాన్యత కింద నాగేశ్వర్ను ఎంచుకున్నారనే ప్రచారం పట్టభద్రుల్లో సాగుతోంది.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్ని ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వస్తాయి… వారికి ప్రథమ ప్రాధాన్యత కింద వచ్చిన ఓట్లలో తమకు ఎన్ని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు వస్తాయన్న దానిపై ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.