Homeఆంధ్రప్రదేశ్‌ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు.. ఎవరికి మొగ్గు?

ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు.. ఎవరికి మొగ్గు?

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలకు ముహూర్తం ఖరారైంది. వివాదాలు సమసిపోవడంతో ఓట్ల లెక్కింపును ఆదివారం ప్రారంభించనుంది. నగరంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ఆరంభించనున్నారు. కౌంటింగ్ ప్రాంగణంలో నాలుగు హాల్స్ లో 47 టేబుల్స్ ఏర్పాటు చేశారు.

ఒక్కొక్క టేబుల్ లో ఒక్కో డివిజన్ ఓట్లను లెక్కిస్తున్నారు. లెక్కింపునకు 64 మంది సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లను 250 మందిని ఏర్పాటు చేశారు. వీరు కాకుండా 500 మంది మున్సిపల్ సిబ్బంది పాల్గొంటారు. కౌంటింగ్ ప్రక్రియలో కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నామని అధికారులు తెలిపారు.

కౌంటింగ్ హాళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి విజేతలను ప్రకటించే వరకు వీడియో కెమెరా ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నానికి కౌంటింగ్ పూర్తవుతుందని చెబుతున్నారు. తొలుత 50 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంటింగ్ సిబ్బంది లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం డివిజన్ల వారీగా ఓట్లు లెక్కిస్తారు.

ప్రతి టేబుల్ కి ప్రతి రౌండ్ లో వెయ్యి ఓట్లు లెక్కిస్తారు. ప్రతి టేబుల్ కు 25 ఓట్లను బండిల్ గా కట్టి 40 బండిల్స్ గా లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు స్వయంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షిస్తున్నారు. ఏటూరు కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉండగా ఇప్పటికే మూడు డివిజన్లను జగన్ నేతృత్వంలోని వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 47 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి.

నాలుగు నెలలు ఆలస్యంగా కౌంటింగ్ జరుగుతోంది. ఏపీలో 75 మున్సిపాలిటీలకు గాను తాడిపత్రి తప్ప 74 చోట్ల వైసీపీ గెలవడం, 12 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 11 కార్పొరేషన్లు జగన్ పార్టీ చేజిక్కించుకోవడం తెలిసిందే. ఏలూరులోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే అంచనాలున్నాయి. దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version