ఢిల్లీలోని నిజాముద్దీన్ లో మార్చి, 13, 14 15 తేదీలలో జరిగిన తబ్లిగి జమాత్ ప్రార్థనలు భారత్ లో కరోనా వ్యాప్తి ఉధృతికి కారణమై వేలాది మంది వైరస్ బారిన పడేలా చేశాయి. మర్కజ్ మసీదులో ఈ ప్రార్థనలు జరగ్గా.. వేలమంది ముస్లింలు మనదేశం నుంచే కాక.. విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈనేపథ్యంలో ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ (డీఎంసీ) రాష్ట్ర ఆరోగ్యకు శాఖకు ఓ విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ ఆరోగ్యశాఖ రోజూవారీ హెల్త్ బులెటిన్లో ‘నిజాముద్దీన్ మర్కజ్’ అని ప్రత్యేకంగా పేర్కొంటూ కేసుల వివరాలు ఇవ్వకూడదని విన్నవించింది. ఈమేరకు డీఎంసీ చైర్మన్ జఫారుల్ ఇస్లాం ఖాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి శుక్రవారం లేఖ రాశారు. వైరస్ సోకినవారి వివరాలు ఇస్తున్న క్రమంలో తబ్లిగి జమాత్ లేదా మర్కజ్ నుంచి వచ్చినవారు ఇంతమంది.. అంటూ ప్రత్యేకంగా చూపెట్టడం ఒక మతాన్ని తక్కువ చేసినట్టేనని అన్నారు.
ఉద్యేశపూర్వకంగా, దురాలోచనతోనే ఇలాంటి వర్గీకరణ వార్తలతో మా మతంపై పలు మీడియా సంస్థలు, హిందుత్వ శక్తులు ద్వేషం పెంచుతున్నాయి. వాటి కారణంగా కొన్ని ప్రాంతాల్లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి. ముస్లిం వ్యక్తులను సోషల్ బాయ్ కాట్ చేస్తున్నారు. మొన్న ఈశాన్య ఢిల్లీలో ఓ యువకుడిని కొట్టి చంపారు. ఇప్పటికైనా నిజాముద్దీన్ మర్కజ్ పేరును వార్తలు, బులెటిన్లలో పేర్కొనవద్దు’ అని ఇస్లాం ఖాన్ ఢిల్లీ హెల్త్ డిపార్ట్మెంట్ కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒక వర్గం, మతం ఆధారంగా కరోనా కేసులు వివరాలు ప్రకటించొద్దని చెప్పింది. వైరస్కు గురికావడమనేది ఎవరి తప్పిదం కాదని, బాధితుల వివరాలు వార్తల్లో ప్రచురించొద్దని కేంద్ర హోంశాఖ కూడా చెప్పింది’అని ఆయన తెలిపారు.