ఇప్పుడు ఏపీలోని సీరియస్ అంశాల్లో ఒకటి జగన్ బెయిల్ రద్దు. దాదాపు ఏడాది కాలంగా ఈ అంశంపై చర్చ సాగుతూనే ఉంది. ‘జగన్ బెయిల్ రద్దు అవుతుంది.. మళ్లీ జైలుకు వెళ్తారు’ అని ఎవరో ఒక నేత అనడం.. పత్రికల్లో, టీవీల్లో రావడం కామన్ అయిపోయింది. దీంతో.. జనాలు కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ.. ఇప్పుడు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన బెయిల్ రద్దు పిటీషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించడంతో అందరూ అలర్ట్ అయిపోయారు.
‘జగన్ బెయిల్ నిజంగానే రద్దు అయిపోతుందా?’ అనే చర్చ మొదలైంది. ఇందులో సీరియస్ నెస్ ఎంత? అని డిస్కస్ చేసుకుంటున్నారు. రఘురామ మాత్రం.. తాను గెలిచేశానన్నంత ఆనందంగా ఉన్నారు. జగన్ ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని, వైసీపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని అంటున్నారు. జగన్ ను మళ్లీ జైలుకు పంపించే దాకా నిద్రపోయే ప్రసక్తే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు రెబల్ ఎంపీ.
ఇక, టీడీపీ నేతలు తరచూ ఈ మాట అంటూనే ఉన్నారు. జగన్ బెయిల్ రద్దు కావడం తథ్యం.. మళ్లీ జైలుకు వెళ్లడం కూడా తప్పదు అంటూ శాపనార్థాలు పెడుతూనే వస్తున్నారు. అయితే.. బీజేపీ నేతలు కూడా ఈ మాట మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. జగన్ వచ్చే మూడేళ్లూ ముఖ్యమంత్రి పదవిలో ఉంటాడని తాను అనుకోవడం లేదని అన్నారట. దీంతో.. ఇది సీరియస్ వ్యవహారమే అనుకుంటున్నారు చాలా మంది నేతలు.
ఇప్పటికైతే కోర్టు విచారణకు తీసుకుంది. మరి, ఆ విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? ప్రతివాదులు ఎలాంటి ఆధారాలు చూపిస్తారు? కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఆసక్తికరం. అయితే.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చన్నది కొట్టిపారేయలేని అంశం. అదే సమయంలో.. విపక్షంలోని నేతలు, కేంద్ర ప్రతినిధులుగా చెప్పుకునే నేతలు కూడా బెయిల్ రద్దు గురించి మాట్లాడుతుండడంతో ఆలోచించాల్సి వస్తోందని అంటున్నారు విశ్లేషకులు. మరి, ఫైనల్ గా ఏం జరుగుతుంది? రఘురామ కృష్ణం రాజు పంతం నెగ్గుతుందా? లేదా? అన్నది చూడాలి.