Homeజాతీయ వార్తలుBandi Sanjay praja Sankalpa Yatra: మోడీ సర్దార్ పటేల్.. కేసీఆర్ వంగి దండాలు పెడుతుండు

Bandi Sanjay praja Sankalpa Yatra: మోడీ సర్దార్ పటేల్.. కేసీఆర్ వంగి దండాలు పెడుతుండు

Bandi Sanjay fires at CM KCR during Prajasankalpayatra : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదం కదులుతూనే ఉంది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట సాగుతున్న ఈ పాదయాత్రలో ఆయన ప్రజల వద్దకు వెళుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. బండి పాదయాత్ర ఈరోజుతో 115 కి.మీలు పూర్తి చేసుకుంది. వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఆయన యాత్ర సాగుతోంది.

పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో బండి సంజయ్ మాట్లాడారు. ‘‘ గతంలో సీఎం ఢిల్లీకి పోతే చర్చ జరిగేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ జిల్లాలో భూ నిర్వాసితుల వద్ద కోట్ల విలువైన స్థలాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం లక్షలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారని బాధితులు బాధపడుతుండ్రు. కేసీఆర్ లక్షల మందికి ఉద్యోగాలిచ్చిండ్రని టీఆర్ఎసోళ్లు చెప్పిండ్రు. మీలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? అన్నీ అబద్దాలే చెబుతుండు.’’ అని బండి సంజయ్ మండిపడ్డారు.

పాతబస్తీలో ఎంఐఎం అనుమతి లేకుండా సభ పెట్టగలవా? అంటూ ఒవైసీ సవాల్ విసిరితే కేసీఆర్ కిమ్మనలేదని బండి సంజయ్ ఎద్దేవా చేవారు.. కానీ బీజేపీ పాతబస్తీకి పోయి సభ పెట్టి జై శ్రీరాం అంటూ కాషాయ జెండాలను రెపరెపలాడించినం. ఒవైసీ మళ్లీ సవాల్ చేస్తే ఈసారి దారుస్సలాం వెళ్లి సభ పెట్టి సత్తా చూపుతం. ఈరోజుతో 115 కి.మీల పాదయాత్ర పూర్తి చేసుకున్న. ఉదయమే సంగమేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈ పవిత్ర గడ్డమీద అడుగుపెడుతున్న. మీ అందరి అభిమానం చూస్తుంటే జిల్లాలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుస్తదని నమ్మకం ఉందని బండి తెలిపారు.

‘‘ఈరోజు పాదయాత్రలో ఓ గుడిసె వద్దకు పోయిన. అందులో 6 గురు ఉంటరట. వానొస్తే తడిసిపోతోంది. సొంత ఊళ్ల ఇల్లు లేదు. కూలీనాలీ చేసుకుని బతుకుతుండ్రు. ప్రభుత్వం పైసా సాయం చేయలేదు. డబుల్ బెడ్రూం ఇస్తానని చెప్పి ఇయ్యలేదు. కేంద్రం 2.4 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే మూర్ఖపు సీఎం కేసీఆర్ ఒక్కటి కూడా కడతలేరు.
యువకులందరికీ ఉద్యోగాలిస్తనన్నడు. ఒక్కరికి కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ భ్రుతి అన్నడు. మాట తప్పిండు. చెరుకు రైతులు, వలస కార్మికులు కలిసి వారి బాధలు చెబుతుంటే మనసు చివుక్కుమన్నది. తీపి పండించే రైతులు గిట్టుబాటు ధర లేక, పైసలు రాక పక్క రాష్ట్రానికి తీసుకెళ్లి అమ్ముకుంటుండ్రు. కనీసం వాళ్లకు భరోసా ఇవ్వకుండా కేసీఆర్ ఫాంహౌజ్ లో పడుకుండు. ‘నువ్వు ఎకరాకు కోటి రూపాయలు పండిస్తున్నని చెబుతున్నవ్. రైతులను మాత్రం బికారీ చేస్తున్నవ్. ఏం పండిస్తున్నవ్. గంజాయి పండిస్తున్నవా? రుణమాఫీ ఇవ్వలేదు. ఏ ఒక్క హామీ నెరవేర్చని సీఎం కేసీఆర్ మాత్రమే.’’ అని బండి సంజయ్ నిప్పులు చెరిగారు.

రైతులు, యువకులు, విద్యార్థులు సహా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నరు. బీజేపీ యాత్రకు మద్దతు తెలుపుతూ పోరాడమని చెబుతుండ్రు. ఈ ప్రాంతానికి సింగూరు నీళ్లిస్తామని మాట తప్పిండు. కనీసం మిషన్ భగీరథ నీళ్లు కూడా సరిగా రావడం లేదు. 4 రోజులకు ఒకసారి వస్తున్నయ్. కేసీఆర్ సిగ్గుపడాలని బీజేపీ అధ్యక్షులు నిప్పులు చెరిగారు. కేసీఆర్….మీకు ఇచ్చిన నిధులన్నీ కేంద్రానివే. రేషన్ బియ్యానికి, మరుగుదొడ్లకు, రోడ్లకు, రైతు వేదికలకు, లైట్లు, కమ్యూనిటీ హాళ్లు, హరితహారంసహా చివరక స్మశాన వాటికల నిర్మాణానికి నిధులు కేంద్రమే ఇచ్చింది. ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత కూడా నరేంద్ర మోదీదే. అయినా కేంద్రం ఏమీ ఇస్తలేదని చెబుతుండు. కేసీఆర్ కు దమ్ముంటే కేంద్రం పైసా ఇవ్వడం లేదని ప్రధానికి లేఖ రాయాలని సవాల్ చేస్తున్న.

మోదీని చూస్తుంటే అభినవ సర్దార్ లా కన్పిస్తుండు… తెలంగాణ ప్రజలకు దేవుడు. మోదీకి కేసీఆర్ వంగి వంగి దండాలు పెడుతుండటాన్ని చూస్తే నాడు నిజాం రాజు సర్దార్ పటేల్ ముందు వంగి వంగి దండాలు పెట్టినట్లు కన్పించిందని బండి సంజయ్ విమర్శించారు. ‘‘దళితులను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. ఉద్యోగులకు జీతాలివ్వలేని సీఎం దళిత బంధు ఎలా ఇవ్వగలరో ఆలోచించాలి. మేం దళిత బంధుకు వ్యతిరేకం కాదు. హుజూరాబాద్ సహా రాష్ట్రంలోని దళితులకు, బీసీలకు, గిరిజనులకు ‘బంధు’ పేరిట సాయం చేయాల్సిందే.

హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కోవిడ్ పేరుతో ఎన్నికలు నిర్వహించొద్దంటూ ఎన్నికల కమిషన్ కు లేఖ రాసిండు. సిగ్గు చేటు. బార్లు, బడులు ఓపెన్ చేస్తారు. సభలు జరుపుతారు. కానీ హుజూరాబాద్ ఎన్నికలకు మాత్రం కోవిడ్ అడ్డమొచ్చిందట. ఓడిపోతామనే భయంతోనే వాయిదా వేయించిండు. ఈ ముఖ్యమంత్రి పాలనను తరిమికొట్టే పార్టీ బీజేపీ మాత్రమే. అవినీతి, కుటుంబ, గడీల, నయా నిజాం పాలనను ఎదుర్కొనే పార్టీ బీజేపీ మాత్రమే. అందుకే ప్రజా సంగ్రామ యాత్రకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నరు. అక్టోబర్ 2 వరకు పాదయాత్ర చేసి తీరతం. పార్టీలోని ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను, పిల్లలను ఒప్పంచి పాదయాత్రకు సిద్ధమై వచ్చిండ్రు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా భారత్ మాతాకీ జై అంటూ ఛత్రపతి శివాజీ, భగత్ సింగ్ స్పూర్తితో ముందుకు కదులుతున్నరు.’’ అని బండి సంజయ్ నిప్పులు చెరిగారు.

1400 మంది త్యాగాలతో తెలంగాణ వస్తే 4 కోట్ల ప్రజల ఆశలకు భిన్నంగా కేసీఆర్ పాలన చేస్తుండని బండి సంజయ్ విమర్శించాడు. ఇవన్నీ మాట్లాడుతుంటే బీజేపీని మతతత్వ పార్టీ అంటుండు. ఎంఐఎం మతతత్వ పార్టీ. ఆ పార్టీతో చేతులు కలిపి పనిచేస్తోంది టీఆర్ఎస్. 80 శాతం ఓట్లున్న హిందువుల సంక్షేమం కోసం బీజేపీ పనిచేస్తుందని బండి సంజయ్ మండిపడ్డారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular