Nara Lokesh Padayatra: టిడిపి యువ నేత నారా లోకేష్ పాదయాత్ర నేడు పున ప్రారంభం కానుంది. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన కాలినడకను ప్రారంభించనున్నారు. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. కానీ ప్రారంభం నుంచే అవరోధాలు ప్రారంభమయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో వైసీపీ నేతల నిలదీతలు, అభ్యంతరాలు సైతం కొనసాగాయి. ప్రారంభ దశలో నందమూరి తారకరత్న అకాల మరణం సైతం అడ్డంకిగా నిలిచింది. అయినా సరే మొక్కవోని దీక్షతో లోకేష్ ముందుకు సాగారు. రాయలసీమలో విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేశారు. కోస్తాలో సైతం నిర్విరామంగా యాత్ర పూర్తి చేశారు. సరిగ్గా కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం లో పాదయాత్రకు బ్రేక్ పడింది.
సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో లోకేష్ పాదయాత్రను నిలిపివేశారు. హుటాహుటిన రాజమండ్రి కి చేరుకున్నారు. అప్పటినుంచి తండ్రి కేసులు పర్యవేక్షిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపారు. ఒకానొక దశలో తండ్రికి బెయిల్ రాకుండానే పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కానీ సీనియర్లు వారించడంతో పాదయాత్ర ప్రారంభ నిర్ణయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో పాదయాత్ర ప్రారంభానికి సిద్ధపడుతున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఎక్కడ నిలిచిపోయిందో అక్కడ నుంచే పాదయాత్ర ప్రారంభానికి సన్నాహాలు పూర్తి చేశారు.
అయితే పాదయాత్ర షెడ్యూల్ సమూల మార్పులు చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు కాకుండా.. విశాఖకి పాదయాత్ర పరిమితం చేయనున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తుండడంతో వీలైనంత త్వరగా పాదయాత్ర పూర్తి చేసి పార్టీ వ్యూహాల్లో భాగం కావాలని లోకేష్ చూస్తున్నట్లు సమాచారం. టిడిపి తో పొత్తు ప్రకటన తర్వాత చంద్రబాబు లేని సమయంలో లోకేష్ క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ తరుణంలో పాదయాత్రను త్వరగా పూర్తిచేసి అటు మంగళగిరి నియోజకవర్గంలో ఫోకస్ పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు, అన్ని నియోజకవర్గాల సమన్వయం బాధ్యతలు లోకేష్ పై ఉండడంతో… డిసెంబర్ నెలాఖరుకు పాదయాత్ర పూర్తి చేయాలని లోకేష్ కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా లోకేష్ పాదయాత్ర పూర్తి కావాలని టిడిపి శ్రేణులు కోరుకుంటున్నాయి.