Maharashtra Election : కేసీఆర్‌కు ఘోర అవమానం.. అక్కడ డిపాజిట్‌ గల్లంతు! 

నిజాబాబాద్‌ జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు మహారాష్ట్రలో పార్టీ విస్తరణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో మొట్టమొదటి ఎన్నికల్లోనే బీఆర్ఎస్‌ ఎదురుదెబ్బ తగిలింది. 

Written By: Raj Shekar, Updated On : April 30, 2023 9:04 pm
Follow us on

Maharashtra Election : జాతీయ రాజకీయాల కోసం టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్‌.. పార్టీ విస్తరణపై దృష్టిపెట్టారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో గులాబీ బాస్‌ దూకుడు పెంచారు. త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈమేరకు ఇప్పటికే మహారాష్ట్రలో మూడు సభలు నిర్వహించారు. తెలంగాణ సరిహద్దున ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజాబాబాద్‌ జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు మహారాష్ట్రలో పార్టీ విస్తరణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో మొట్టమొదటి ఎన్నికల్లోనే బీఆర్ఎస్‌ ఎదురుదెబ్బ తగిలింది.

బోకర్‌ మార్కెట్‌ కమిటీ ఎన్నికల్లో ఓటమి.. 
మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా బోకర్ తాలూకా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఓడిపోయారు. మొత్తం 18 డైరెక్టర్ పోస్టులకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. శనివారం ఓట్ల లెక్కింపు జరిగింది. కాంగ్రెస్ మద్దతుదారులు 15 మంది, బీజేపీ మద్దతుదారులు ముగ్గురు విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతుదారులు ఒక్కరూ గెలవలేకపోయారు.
ఓటమితోనే ప్రయాణం..  
జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత పొరుగు బీఆర్‌ఎస్‌ అధినేత తెలంగాణ బయట తొలి సభ మహరాష్ట్రలోని నాందేడ్‌లోనే నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజాబాబాద్‌ జిల్లాలకు చెందిన నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ సభకు భారీగా జన సమీకరణ చేశారు. దీంతో పార్టీకి మంచి స‍్పందన వస్తోందని బీఆర్‌ఎస్‌ ప్రచారం చేసుకుంది. అయితే వాపును చూసి బలుపు అన్నట్లు.. బహిరగ సభకు వచ్చిన వారంతా రైతులే అని, తమ పార్టీ విధానం కూడా రైతు విధానమే కావడంతో భోకర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఎన్నికల్లో గెలుస్తామని గులాబీ బాస్‌ భావించారు. పార్టీ తరఫున 18 మంది డైరెక్టర్లను బరిలో నిలిపారు. కానీ బీఆర్‌ఎస్‌ మద్దతుదారులంతా పరాజయం పాలయ్యారు. దీంతో తెలంగాణ బయట బీఆర్‌ఎస్‌ ప్రయాణం ఓటమితోనే మొదలైంది.
బీఆర్‌ఎస్‌లో చేరిన నేతకు బంగపాటు.. 
ఈ మార్కెట్‌పై పట్టున్న నాగ్‌నాథ్‌సింగ్‌ ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. భోకర్‌ మార్కెట్‌కు నాందేడ్‌ జిల్లాలోనే అతిపెద్దదనే పేరుంది. చాలా మంది రాజకీయ ప్రముఖులు ఈ మార్కెట్‌ కమిటీ ఎన్నికల నుంచే తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పైగా, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌చవాన్‌ నియోజకవర్గం(భోకర్‌) పరిధిలో ఉన్న ఈ మార్కెట్ కమిటీలో నెగ్గి ఆ రాష్ట్రంలో తమ రాకను చాటుకోవాలని బీఆర్ఎస్ భావించింది. కానీ, నాగ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలో బరిలోకి దిగిన 18 మంది అభ్యర్థులు ఎన్ని హామీలు ఇచ్చినా అక్కడి రైతులు నమ్మలేదు.