Vivekam: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇతివృత్తంగా తీసుకొని రూపొందించిన సినిమా ‘వివేకం’. అసలు ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా ఎంట్రీ ఇవ్వలేదు. కానీ 55 యూట్యూబ్ చానళ్ళలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. ఆదివారం నాటికి 2.15 కోట్ల వ్యూయర్షిప్ దాటి రికార్డు సృష్టించింది. యూట్యూబ్ సినిమా చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా నమోదయింది. ఎన్నికలకు ముంగిట.. గత నాలుగురోజుల్లో ఐదు లక్షలకు పైగా వ్యూయర్షిప్ రావడం మరో రికార్డ్.
గత ఐదు సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి హత్య అంశం ఏపీని కుదిపేస్తోంది. వైయస్ కుటుంబ వ్యక్తులే వివేకానంద రెడ్డిని హత్య చేశారని.. అదే కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ వచ్చారు. రాజకీయ ఆధిపత్యం కోసం ఈ హత్య జరిగినట్లు ప్రచారం ఉంది. సిబిఐ కూడా దానినే ధ్రువీకరించింది. ఒకవైపు వైయస్ సునీత తన తండ్రి హత్య విషయంలో గట్టిగానే న్యాయం పోరాటం చేస్తున్నారు. మరోవైపు వైఎస్ షర్మిల ఊరు వాడ తన బాబాయ్ హత్య అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రధాన నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డిని జగన్ వెనుకేసుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు విపక్షాలకు సైతం వివేకానంద రెడ్డి హత్య అంశం ప్రచార అస్త్రంగా మారింది. ఈ తరుణంలోనే వివేకం సినిమా రావడం విశేషం.
వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన అభియోగ పత్రాల్లో అంశాలను ఆధారంగా చేసుకుని వివేకం సినిమాను రూపొందించారు. కళ్లకు కట్టినట్లు ఈ హత్య ఉదంతాన్ని ఈ సినిమా ద్వారా బయటపెట్టారు. ఈ కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు సీఎం జగన్ మద్దతు తెలుపుతూ టికెట్ ఇచ్చి మరోసారి ప్రోత్సహించారు. దీనినే హైలెట్ చేస్తున్నారు షర్మిల, సునీతలు.కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వైయస్ కుటుంబంలో గట్టి యుద్ధమే నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆ కుటుంబానికి చెందిన ఏ చిన్న వార్త అయినా ప్రాధాన్యత అంశంగా మారిపోయింది. ప్రస్తుతం వివేకం సినిమా 55 యూట్యూబ్ ఛానళ్లలో ప్రదర్శితం అవుతుండడంతో.. నెటిజెన్లు ఎక్కువగా వీక్షిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఈ సినిమా తప్పకుండా ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More