రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ పంట వేయాలన్న విషయాన్ని రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకె) ద్వారా అవగాహన కలిగించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లాక్ డౌన్, వ్యవసాయం రంగంపై శుక్రవారం సమీక్షించారు. ఏ పంట వేస్తే మార్కెట్లో మంచి ధరకు లభించే అవకాశాలు ఉన్నాయన్నదానిపై రైతులకు అవగాహన కలిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గ్రామంలో ఏయే పంటలు ఎంతమేర పండించాలన్న విషయమై రైతులతో మాట్లడి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయంగా వివరాలను విశ్లేషించి ఆమేరకు కార్యాచరణ రూపొంచాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రస్థాయి వ్యవసాయ అడ్వైజరీ బోర్డులు, జిల్లా అడ్వైజరీ బోర్డులు, మండల అడ్వైజరీ బోర్డులు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఏ పంటలు, ఎక్కడ ఎంతమేర సాగుచేయాలన్నదానిపై ఈ బోర్డులు సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ బోర్డుల ఏర్పాటుకు వెంటనే చర్యలు ప్రారంభించాలన్నారు. పంటలు వేసేటప్పుడే ధర ప్రకటించి, ఆ రైతుకు ఆ ధర దక్కేలా చూడాలని నిర్ణయించారు. దీనివల్ల రైతుల్లో విశ్వాసం కలుగుతోందని భావిస్తున్నారు. పంటలను ఇ– క్రాపింగ్ చేయడం, రైతు భరోసాకేంద్రాలను వినియోగించి వాటిని కొనుగోలు చేయడం, ఈ ప్రక్రియలన్నీ వ్యవస్థీకృతంగా సాగిపోవాలని సూచించారు.
ధాన్యం సేకరణ అన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతోందన్న అధికారులు సీఎంకు తెలిపారు. ఒక్క కృష్ణాజిల్లాలో సేకరిస్తున్న సమయంలో బస్తాకు కొంత ధాన్యాన్ని మినహాయిస్తున్నారంటూ రైతులనుంచి వచ్చిన ఫిర్యాదులపై సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై సీఎం తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, సెక్రటరీ, డీజీపీ లాంటి వ్యక్తులంతా ఇదే కృష్ణా జిల్లాలో ఉన్నాసరే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సరికాదన్న స్పష్టం చేశారు. చూస్తూ ఊరుకునే పరిస్థితి వద్దని, వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు న్యాయం అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవద్దని స్పష్టం చేశారు. పంటలను రోడ్డుమీద వేసిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలో రోజూ కనిపించేవన్న సీఎం అలాంటి ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో కనిపించడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు. చీనీ, అరటి, టమోటో, మామిడి ప్రాససింగ్ ప్లాంట్లపై దృష్టి పెట్టాలన్నారు.