Visakhapatnam Railway Zone Launch April 1: ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్. విశాఖ( Visakhapatnam) కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఇందుకు ముహూర్తం ఖరారు చేసింది రైల్వే శాఖ. ప్రత్యేక రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్రవాసుల దశాబ్దాల కల. విభజన హామీల్లో అత్యంత కీలకమైనది. 2019లో ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించినప్పటికీ అనేక రకాల సాంకేతిక కారణాలతో జాప్యం జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ ఒకటి నుంచి ప్రత్యేక రైల్వే జోన్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇప్పటికే శాశ్వత భవన నిర్మాణం ముడసర్లోవలో జరుగుతోంది. అప్పటివరకు పరిపాలన పనుల కోసం సిరిపురం జంక్షన్ వద్ద ఉన్న ఐకానిక్ భవనం ది డెక్ సిద్ధమయ్యింది. విశాఖ నగరం నడిబొడ్డున ఉంది ఈ భవనం. ప్రత్యేక రైల్వే జోన్ కేంద్రానికి ఆకర్షణగా నిలవనుంది.
Also Read: రాజశేఖర్ కొత్త బిజినెస్ ను ఓపెన్ చేయడానికి వెళ్తున్న చిరంజీవి… ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే..?
* అత్యాధునిక వసతులతో..
విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ( Visakhapatnam Metro region Development Authority) అత్యాధునిక వసతులతో నిర్మించింది డెక్ భవనాన్ని. సుమారు రూ.80 కోట్లకు పైగా ఈ భవనం కోసం ఖర్చు చేశారు. క్రూయిజ్ షిప్ ఆకారంలో ఉండే ఈ 12 అంతస్తుల భవనం.. విశాఖ సముద్ర తీరానికి ప్రత్యేక గా నిలుస్తుంది. ఇందులో సుమారు 41 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 6, 7 అంతస్తులను రైల్వే జోన్ తాత్కాలిక ప్రధాన కార్యాలయం కోసం కేటాయించారు. ఈ ప్రత్యేక రైల్వే జోన్ కార్యాలయం నుంచి 30 మంది ఉన్నతాధికారులు, 700 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
* కూటమికి టర్నింగ్ పాయింట్..
అయితే ఇది కూటమి ప్రభుత్వానికి టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఆరేళ్లపాటు ప్రత్యేక రైల్వే జోన్ కార్యకలాపాలు మొదలు కాలేదు. గెజిట్ నోటిఫికేషన్ కూడా రాలేదు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే జోన్ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో క్లారిటీ ఇచ్చారు. దీంతో ఒక్కో అడ్డంకి తొలగిపోతూ వస్తోంది. ముఖ్యంగా వాల్తేర్ డివిజన్ విభజన, రాయగడలో కొత్త డివిజన్ ఏర్పాటు వంటి అంశాలపై ఒడిస్సా తో ఏపీకి ఏర్పడిన వివాదాలను కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు. ఏప్రిల్ 1న అపాయింట్మెంట్ డేగా ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
* కొత్త రైల్వే డివిజన్లతో..
ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగేది. అయితే ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఏర్పాటు అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి.. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు రానున్నాయి. కొత్తగా విశాఖ డివిజన్ కూడా ఏర్పాటు చేశారు. అది సైతం ఇదే జోన్లోకి రానుంది. కొత్త జోన్ పరిధిలో 17వేల మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. అయితే రైల్వే జోన్ ఏర్పాటుతో కొత్త రైళ్ల మంజూరు, ప్లాట్ ఫామ్ ల విస్తరణ, రవాణా రంగంలో అభివృద్ధికి దోహద పడనుంది. మరోవైపు ముడసర్లోవలో దాదాపు 150 కోట్ల రూపాయలతో శాశ్వత కార్యాలయ భవన నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి.
