Telugu YouTubers Fraud Case: తెలుగు స్పష్టంగా మాట్లాడుతారు. తెలుగు వాళ్ళ కోసమే మేమున్నాం అన్నట్టుగా కలరింగ్ ఇస్తుంటారు. అంతేకాదు తెలుగుజాతి గురించి.. తెలుగు మనుషుల గురించి గొప్పగా చెబుతుంటారు. అదంతా నిజమైన నమ్మి చాలామంది మోసపోయారు. ఆ మోసపోయిన వాళ్లు కూడా తెలుగువాళ్లే కావడం విశేషం.
యూట్యూబ్ వేదికగా నందుస్ వరల్డ్ అనే పేరుతో ఒక ఛానల్ ఏర్పాటు చేశారు జాగర్లమూడి మధుకర్, రమానందన. వీరిది గుంటూరు జిల్లా. వీరు నందుస్ వరల్డ్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు.. అందులో ఇంగ్లాండ్లో స్థిరపడిన భారతీయుల గురించి.. ఇంగ్లాండ్ కు రావాలి అనుకుంటున్న భారతీయుల గురించి రకరకాల విషయాలు చెప్పేవారు. దీంతో అనతి కాలంలోనే విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు. వీరు యూట్యూబ్ వేదికగా మోసాలు చేయడానికి ఈ ఛానల్ ఏర్పాటు చేశారని ఇప్పుడు తేలింది.
రమానందన, మధుకర్ యూకే కు చాలా కాలం క్రితం వెళ్లారు. అక్కడ విరు స్థిరపడ్డారు. వీరిది గుంటూరు జిల్లా. వీరు మోసం చేశారని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది నవంబర్లో ఒక కేసు నమోదు అయింది. ఆ కేసు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలోని కొత్తూరు ప్రాంతానికి చెందిన శివ క్రాంతి కుమార్ అనే వ్యక్తి లండన్ లో చదువుకున్నాడు. ఇతడు అక్కడ చదువుకున్నప్పుడు మధుకర్ పరిచయమయ్యాడు. శివ క్రాంతి అక్కడ ఉద్యోగం చేసి.. ఆ తర్వాత ఇండియాకు వచ్చాడు. అతడి వీసా రెన్యువల్.. భార్య కు సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్.. ఉద్యోగ అవకాశాల కోసం శివ క్రాంతి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో మధుకర్ ను కలిశాడు. ఈ నేపథ్యంలో మధుకర్ శివ క్రాంతిని గుంటూరులో ఉన్న డెస్టినీ అనే కార్యాలయంలో స్పందించాలని సూచించాడు. అక్కడ తన తండ్రి మోహన్ రావు ఉంటాడని.. అతడికి 15 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. మోహన్ రావు శివ క్రాంతి 2023లో కలిశాడు. అతడు చెప్పినట్టుగా రెండు ఖాతాలకు 15 లక్షలు పంపించాడు.
నగదు చెల్లించిన రెండు నెలల తర్వాత అగార్డ్ సొల్యూషన్స్ పేరుతో మధుకర్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ను శివ క్రాంతికి పంపించాడు. దీంతో శివ క్రాంతి ఆ కంపెనీలో ఆరా తీశాడు.. తన కంపెనీని మధుకర్ తప్పుడు మార్గానికి వాడుకున్నాడని సంస్థ అధినేత ఫైజల్ చెప్పాడు. దీంతో శివ క్రాంతి కాళ్ళకింది భూమి కంపించిపోయింది. దీంతో అతడు మధుకర్ దంపతులను నిలదీశాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఫలితంగా మధుకర్ దంపతులు కేవలం రెండు లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగతా డబ్బులు ఇవ్వలేదు. దీంతో శివ క్రాంతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేసిన పోలీసులు.. నోటీసులు పంపించారు. మధుకర్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణ దశలో ఉంది
కేవలం శివ క్రాంతి మాత్రమే కాకుండా గుజరాత్ రాజస్థాన్ బీహార్ రాష్ట్రాలకు చెందిన చాలామంది యువకులను వీరిద్దరూ ఇలానే మోసం చేసినట్టు తెలుస్తోంది. ఒక్కో వ్యక్తి దగ్గర దాదాపు 20 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై రమానందన స్పందించారు. తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమకు ఎటువంటి కంపెనీలు లేవని చెప్పారు. కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
