Kadapa Zilla Parishad : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరో సవాల్ ఎదుర్కొంటున్నారు. కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో జడ్పీ పీఠం నిలబెట్టుకోవడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సవాల్ గా మారనుంది. జడ్పీ చైర్మన్ గా ఉన్న అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో జడ్పీ చైర్మన్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో కూటమి భారీ విజయం నమోదు చేసుకుంది. ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల, బద్వేలు, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాల కు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయింది. ఈ తరుణంలో జిల్లా పరిషత్ చైర్మన్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* చైర్మన్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో..
2021 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్తు( Jila Parishad) స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి అమర్నాథ్ రెడ్డికి వరించింది. 2024 ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి రాజంపేట నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. దీంతో అమర్నాథ్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇంకా 15 నెలలపాటు జిల్లా పరిషత్ కు గడువు ఉంది. ప్రస్తుతం వైస్ చైర్పర్సన్ గా ఉన్న శారద చైర్ పర్సన్ గా వ్యవహరిస్తూ వచ్చారు.
* చైర్మన్ పోస్టుకు పోటాపోటీ
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పిటిసి సభ్యులు( zptc members ) ఐక్యంగా కనిపిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా వారిని శిబిరాలకు తరలించే పనిలో పడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే జడ్పీ చైర్మన్ కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతలు వేరువేరు శిబిరాలుగా విడిపోయారు. ప్రధానంగా బ్రహ్మంగారిమఠం జడ్పిటిసి సభ్యుడు రామ గోవిందరెడ్డి అభ్యర్థిత్వం వైపు జగన్ మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన వైపు చాలామంది జడ్పిటిసిలు ఆసక్తి చూపడం లేదు. ఈ తరుణంలో చాలామంది జడ్పిటిసిలు కూటమి పార్టీల వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమయింది. తమ పార్టీ జడ్పిటిసి లను కాపాడుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. అవసరం అనుకుంటే భారీగా తాయిలాలు సైతం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
* అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ఘనవిజయం
ఉమ్మడి కడప జిల్లాలో( Kadapa district ) 50 మంది జడ్పిటిసి సభ్యులు ఉన్నారు. 2021 లో జరిగిన ఎన్నికల్లో 49 మంది సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. గోపవరం మండలం నుంచి మాత్రమే టిడిపి అభ్యర్థి అప్పట్లో విజయం సాధించారు. అయితే చాలామంది జడ్పిటిసిలు కూటమి పార్టీలకు అనుకూలంగా వ్యవహరించారు. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో తిరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అనుమానం కూడా అదే. అయితే కడప జిల్లా పరిషత్తు చైర్మన్ పీఠాన్ని వదులుకుంటే మాత్రం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి మరింత ఇబ్బందులకు గురిచేసి అంశమే. అందుకే జగన్ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా మొత్తం 50 మంది సభ్యులకు గాను.. 47 మంది జడ్పీటీసీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కూటమి పార్టీల వైపు జడ్పీటీసీలు వెళ్లిపోయారని. ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలతోపాటు ఎంపీలు ఉండడంతో విజయం తమదేనని కూటమి భావిస్తోంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ జడ్పిటిసి లను తీసుకుని క్యాంపు రాజకీయానికి బయలుదేరినట్లు సమాచారం. మరి కడప జిల్లా రాజకీయం ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి.