Byreddy Siddharth Reddy YSRCP role: కర్నూలు జిల్లాలో రాజకీయాలు మారుతున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇటీవల కర్నూలు నగరంలో పర్యటించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మంత్రిగా ఉన్న టీజీ భరత్ పైనే ఆరోపణలు చేశారు. అనేక రకాల విమర్శలు చేశారు. అదే స్థాయిలో టిడిపి నుంచి ఆయనపై కౌంటర్ అటాక్ ప్రారంభం అయింది. ఏదైనా వివాదం సృష్టించాలి అనుకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రంగంలోకి దిగుతారు అనేది టిడిపి నేతలు వాదన. జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్న మనిషిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై ఒక విమర్శ ఉంది. దానినే గుర్తు చేస్తున్నారు టిడిపి నేతలు. ఆయన కంటే వెనుక రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సోదరి, అంటే పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రం చట్టసభలకు ఇంతవరకు ఎన్నిక కాలేకపోయారు.
రాజకీయంగా ప్రత్యేక ప్రస్థానం..
కర్నూలు జిల్లాలో బైరెడ్డి కుటుంబానికి ప్రత్యేక రాజకీయ ప్రస్థానం ఉంది. ఆ ఫ్యామిలీ ఆది నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తండ్రి కూడా ఎమ్మెల్యేగా వ్యవహరించారు. మంత్రి పదవి చేపట్టారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సైతం టిడిపి ద్వారా ఎన్నో పదవులు పొందారు. చట్టసభలకు ఎన్నికయ్యారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ్ముడు కుమారుడే సిద్ధార్థ రెడ్డి. ఆయనపై పలుమార్లు కేసులు నమోదయ్యాయి. ఫ్యాక్షన్ తరహాలో కామెంట్స్ చేస్తుంటారు. తనకు జైలు జీవితం కొత్త కాదు అన్నట్టు మాట్లాడుతుంటారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలోనే సిద్ధార్థ రెడ్డి సైతం వైసీపీలో చేరారు. అయితే రాజశేఖర్ రెడ్డి తిరిగి బిజెపిలోకి వచ్చి అక్కడి నుంచి.. టిడిపిలో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన కుమార్తె ఎంపీగా ఉన్నారు.
మూడు ఎన్నికల్లోను అవకాశం లే
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. పిట్ట కథలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. అయితే చట్టసభలకు ఇంతవరకు ఛాన్స్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. పక్క జిల్లాల్లో సైతం చాలామంది నేతలకు అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి. అటువంటిది ఉద్దేశపూర్వకంగానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సొంత నియోజకవర్గం నందికొట్కూరు ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. మరి అటువంటిప్పుడు సిద్ధార్థ రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వచ్చు కదా. లేకుంటే వేరే అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించవచ్చు కదా? అనే ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. 2014లో ఛాన్స్ దక్కలేదు. 2019లో అవకాశం ఇవ్వలేదు. 2024లో పరిగణలోకి తీసుకోలేదు. అయితే సిద్ధార్థ రెడ్డి మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగానే తపన పడుతున్నారు. ఎక్కడైనా వివాదాస్పద అంశాలను హైలెట్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ప్రయోగిస్తారన్న టాక్ ఉంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
