Jagan political strategy change: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక విషయం కలవరపాటుకు గురిచేస్తోంది. అదే కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవడం. మరోవైపు బిజెపి పెద్దలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టడం. ఈ రెండు పరిణామాలతో ఆ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. కేంద్ర పెద్దలు ఇప్పుడు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. మొన్ననే వారిద్దరి ఇళ్లకు వెళ్లి మరి ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త సంకేతాలు పంపారు. తమకు బలమైన మిత్రులుగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బిజెపి విషయంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గుతూ వచ్చింది. అసలు తత్వం బోధపడడంతో ఏం చేయాలో ఆ పార్టీకి తెలియడం లేదు. బిజెపి చంద్రబాబును బలమైన మిత్రుడిగా నమ్ముతుండడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రుచించడం లేదు. కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవడం కూడా ఆ పార్టీకి నచ్చడం లేదు.
నాలుగు చోట్ల కాంగ్రెస్..
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వరుసగా అధికారంలోకి రాగలిగింది. ఎందుకంటే ఐదు రాష్ట్రాలకు గాను నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముందుగా కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. తరువాత తెలంగాణలో పాగా వేసింది. ఇప్పుడు కేరళలో అధికారంలోకి వచ్చింది. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్ ప్రధాన పక్షంగా ఉంది. అయితే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ క్రమేపి కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం చూస్తుంటే ఆయనకు మింగుడు పడటం లేదు. ఒకవైపు చంద్రబాబు కేంద్ర పెద్దల ద్వారా రాజకీయంగా బలపడుతున్నారు. ఇంకో వైపు తాను వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. ఈ రెండు పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టనివ్వడం లేదు. అందుకే ఇప్పుడు ఏదో ఒక జాతీయ పార్టీతో నేరుగా స్నేహం చేసుకోవడం ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బిజెపితో కటీఫ్ చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలవడం మేలు అనేది విశ్లేషకుల మాట.
సాక్షిలో రాహుల్ కథనాలు..
అయితే ఇటీవల పరిస్థితి మారింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విషయంలో జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యతిరేక భావనతో ఉండేవారు. అటువంటిది తమిళనాడులో విజయ్ గెలుపుతో.. ఆయనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడంతో.. రాహుల్ గాంధీతో విజయ్ కు ఉన్న కెమిస్ట్రీ ని హైలెట్ చేస్తూ సాక్షిలో వరుసగా కథనాలు వచ్చాయి. అసలు రాహుల్ ఫోటోను గాని.. అనుకూల వార్తను కానీ ప్రచురించేందుకు ఇష్టపడని సాక్షి.. రాహుల్ను హైలెట్ చేయడం చూస్తుంటే మాత్రం తెరవెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం ఉంది. మొన్న హైదరాబాద్ పర్యటనకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. చంద్రబాబు ఇంటికి వెళ్లి గంటన్నర పాటు గడిపారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తోంది. ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి బిజెపి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. గతం మాదిరిగా కాంగ్రెస్ పార్టీ పట్ల ద్వేషం తగ్గడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.